ఎన్డీఏలో బుర్ఖా చిచ్చు ? శ్రీలంక తరహా నిషేధం పై భిన్నస్వరాలు
ఢిల్లీ : బుర్ఖా నిషేధం డిమాండ్ ఎన్డీఏలో చిచ్చు పెట్టింది. శ్రీలంక తరహాలో భారత్లోనూ బుర్ఖాలపై నిషేధం విధించాలన్న శివసేన డిమాండ్ను బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే వివాదాస్పద వ్యాఖ్యలపై వార్తల్లో నిలిచే సాధ్వీ ప్రగ్యాసింగ్ మాత్రం శివసేన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న శివసేన, బీజేపీ బంధానికి బుర్ఖా వ్యాఖ్యలతో మరిన్ని బీటలు పడే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్
ఖండించిన బీజేపీ, సైయ్యంటున్న సాధ్వీ
రావణుడి లంక తరహాలో రాముడి అయోధ్యలోనూ బుర్ఖాలపై నిషేధం విధించాలన్న శివసేన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. బుర్ఖాలను బ్యాన్ చేయాలన్న ఆ పార్టీ డిమాండ్ను తోసిపుచ్చింది. భారత్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే వివాదాస్పద వ్యాఖ్యలపై వార్తల్లో నిలుస్తున్న బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ శివసేన డిమాండ్ను సమర్థించారు. దేశ రక్షణ కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసమేనని అన్నారు.
భాగస్వామ్యపక్షాల ఆగ్రహం
అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సైతం శివసేన డిమాండ్ను వ్యతిరేకిస్తున్నాయి. బుర్ఖా వేసుకున్న ప్రతి మహిళా టెర్రరిస్టు కాదన్న విషయాన్ని గుర్తించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్రమంత్రి రామ్దాస్ అతావలే చురకలంటించారు. అది ముస్లింల సంప్రదాయమే కాదు వారి హక్కు అని హితవు పలికారు. మరోవైపు బుర్ఖా నిషేధం డిమాండ్ను షియా వక్ఫ్ బోర్డు తీవ్రంగా ఖండించింది. శివసేన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. బుర్ఖా వేసుకోవాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ముస్లిం మహిళలకే ఉందని షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వసిం రిజ్వీ స్పష్టం చేశారు.
బీజేపీ - శివసేన బంధంపై నీలినీడలు
బుర్ఖాలను నిషేధించాలన్న శివసేన డిమాండ్ను బీజేపీ తోసిపుచ్చడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు అంశాలపై ఇరుపార్టీల మధ్య బేధాభిప్రాయాలున్నాయి. గతంలో బీజేపీ తీరుపై ఆగ్రహంతో శివసేన బంధాన్ని తెంచుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే బుర్ఖా నిషేధం డిమాండ్ ఆ రెండు పార్టీల మధ్య మరోసారి అభిప్రాయబేధాలకు కారణమైంది. ఈ పరిణామంపై శివసేన ఎలా స్పందిస్తుందో తదనంతర పరిణామాలు పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్గా మారింది.