ఎన్నికల ఎఫెక్ట్! ఫేస్ బుక్ కు భారీ ఆదాయం! టాప్ లో ఉన్న పార్టీ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు.. తమ భవిష్యత్తును పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. మొన్నటి దాకా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు అడ్వర్టయిజ్ మెంట్లను ఇచ్చి ప్రచారం చేయించుకునే వారు. తాజాగా ఈ జాబితాలో సోషల్ మీడియా కూడా వచ్చి చేరింది. ఎక్కువమందికి చేరే అవకాశం ఉన్న మాధ్యమం కావడంతో సుమారు 80 శాతం మంది అభ్యర్థులు దీనిపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఫేస్ బుక్ కు భారీ ఆదాయం లభిస్తోంది.
సివిల్స్ లో ర్యాంకు సాధించిన జాతీయ ఉపాధి హామీ కూలీ కుమార్తె
యాడ్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ ఏం చెబుతోంది?
దేశవ్యాప్తంగా 830 రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారం కోసం ఫేస్ బుక్ మీద కూడా ఆధారపడినట్లు యాడ్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఆయా పార్టీల నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలను జారీ చేసినందు వల్ల ఫేస్ బుక్ యాజమాన్యానికి 3.76 కోట్ల రూపాయల ఆదాయం అందినట్లు వెల్లడించింది. కిందటి నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు 3.76 కోట్ల రూపాయల మొత్తాన్ని యాడ్స్ రూపంలో అందినట్లు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కూడా ఓ ప్రకటన వెల్లడించారు. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజకీయాలకు సంబంధించిన 51 వేల ప్రకటనలు ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ అయినట్లు స్పష్టం చేశారు.
30 కోట్ల ఫేస్ బుక్ ఖాతాలు..
మనదేశంలో 30 కోట్ల మందికి పైగా ఫేస్ బుక్ ఖాతాదారులు ఉన్నట్లు యాడ్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. వారందరికీ ఒకేసారి తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేరవేయడానికి వివిధ రాజకీయ పార్టీలు వేల సంఖ్యలో రాజకీయ పరమైన అంశాలను పోస్ట్ చేసినట్లు ఈ నివేదికలో పొందుపరిచారు. ఫేస్ బుక్ తో పోల్చుకుంటే ట్విట్టర్ ఖాతాల సంఖ్య పది శాతమే నమోదైందట. ట్విట్టర్ ను వినియోగించే వారి సంఖ్య మనదేశంలో మూడున్నర కోట్లు మాత్రమే.
బీజేపీ టాప్..
ఫేస్ బుక్ ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, వాటికి సంబంధించిన, వాటి అనుబంధ విషయాలను ఫేస్ బుక్ లో యాడ్స్ రూపంలో ప్రచురించడంలో భారతీయ జనతాపార్టీ టాప్ లో ఉంది. ఫేస్ బుక్ లో యాడ్స్ ను ప్రచురించడానికి బీజేపీ ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్యకాలంలో కోటిన్నర రూపాయలను వ్యయం చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెల్లించే మొత్తాలతో పోల్చుకుంటే ఇది తక్కువే. అయినప్పటికీ.. గతంలో ఎప్పుడూ ఈ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో ఫేస్ బుక్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టలేదు. అలాగే గూగుల్ లో కూడా బీజేపీ 1.2 కోట్ల రూపాయల విలువ చేసే యాడ్స్ ను పొందుపరిచింది.
కాంగ్రెస్ లెస్..
సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారాలను నిర్వహించడంలో బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ బాగా వెనుకబడింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం 56 లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించగలిగంది. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన ఎన్నికల ప్రకటనలను మాత్రమే తాము ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తామని ఆ సంస్థ యాజమాన్యం ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముందంజలో టీడీపీ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ మొత్తం 89 యాడ్స్ లను పోస్ట్ చేసింది. గూగుల్, యూట్యూబ్ ఫ్లాట్ ఫారంలపై టీడీపీ ఎక్కువగా ఆధారపడుతోంది. దీనికోసం ఫిబ్రవరి నుంచి రూ.1.48 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర స్థాయిలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 554 ప్రకటల కోసం రూ.1.21 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 107 యాడ్స్ ల ను ప్రసారం చేయడానికి 1.04 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది.