నోటి దూల: మైకుంది కదా అని వాగాడు... ఆ తర్వాత అడ్డంగా బుక్కైపోయిన బీజేపీ నేత
అనవసరం అనుకున్న చోట తలదూరిస్తే ఫలితాలు చేదుగానే ఉంటాయన్న విషయం ఓ బీజేపీ నేత విషయంలో సరిగ్గా సూట్ అయ్యింది. వందేమాతరంలాంటి జాతీయగేయంను సరిగ్గా పాడరాని వారికి ప్రాంతీయపార్టీలు అభ్యర్థులుగా నిలబెడుతున్నాయని నిప్పులు చెరిగారు మొర్దాబాద్ బీజేపీ కార్యకర్త శివం అగర్వాల్. అయితే ఇదే తనకు బ్యాక్ ఫైర్ అవుతుందని ఊహించలేకపోయాడు పాపం.
బీజేపీ సంకల్ప్ ర్యాలీలో పాల్గొనేందుకు శివం అగర్వాల్కు వీవీఐపీ పాస్ ఉంది. ఇక ప్రసంగాలు చేస్తూ ప్రాంతీయ పార్టీలు దేశభక్తి లేని నాయకులను కనీసం జాతీయ గేయం పాడరాని నేతలను బరిలోకి దింపిందంటూ ధ్వజమెత్తారు. అదే వందేమాతరం గేయాన్ని తనను పాడమని చెప్పగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎప్పుడైతే మీడియా వారు ఈ ప్రశ్న అడిగారో వెంటనే తన ఫోన్ను తడుముకుంటూ అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. అసలు విషయం ఏమిటంటే నీతులు చెప్పిన శివం అగర్వాల్కు కూడా వందేమాతరం పాడటం రాదు. ఇక వందేమాతరం పాట పాడమని అడిగినప్పుడు శివం అగర్వాల్ ముఖం చిన్నబోయింది.
ఇక విలేఖరులు పదేపదే వందేమాతరం పాడాల్సిందిగా ఒత్తిడి తీసుకురాగా.. ఫోన్ వస్తోందని చెప్పి తప్పించుకునే ప్రయత్నంచేశాడు. ఇక ఎలాగైనా ఇరికించాలని భావించారో ఏమో తెలియదు కానీ.. కనీసం జాతీయ గీతం జనగణమణ పాడాల్సిందిగా కోరారు. దీనికి కూడా ఈ బీజేపీ నేత బిక్క చూపులు చూశాడు. అంటే జనగణమణ కూడా అతనికి రాదని తేలిపోయింది.
మొత్తానికి పేరుకు మాత్రమే పార్టీల్లో తిరుగుతున్న నేతలు అధికారం ఉందికదా అని ఎక్కడపడితే అక్కడ నోరుజారితే ఇదిగో ఇలానే శివం అగర్వాల్లా ఉంటుంది పరిస్థితి. అసలు తనకే తెలియనప్పుడు అధికారం ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకోవడం పొరపాటవుతుందని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి.