ఆర్టికల్ 370పై శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం.. ఆయన ఏమి కోరుకున్నారు... బీజేపీ ఏమి చేసింది.. !!
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు డిమాండ్ ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా ఈ వాదన వినిపిస్తూనే ఉంది. దేశంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక అధికారులు కట్టబెట్టడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారిలో ప్రముఖులు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడి అమరులైన ముఖర్జీ కన్న కలను సాకారం చేసి ఆయనకు నిజమైన నివాళి ఇచ్చింది మోడీ సర్కారు.
తొలి ఆర్థికమంత్రి
1901 జులై 6న కలకత్తాలో అశుతోష్ ముఖర్జీ, జోగ్మయా దేవీలకు జన్మించారు శ్యామప్రసాద్. 33ఏళ్ల వయసులోని కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. 1941లో అవిభక్త బెంగాల్ అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన శ్యామ ప్రసాద్ తొలి ఆర్థికమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ విధానాలతో విసుగుచెంది హిందూ మహాసభలో చేరారు. ఆ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. దేశ విభజన సమయంలో బెంగాల్ను పాకిస్థాన్లో చేర్చాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పోరాటం ఫలితంగానే బెంగాల్ భారత్లో భాగమైంది.
నెహ్రూ విధానాలతో విసిగిపోయి జనసంఘ్ ఏర్పాటు
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన తొలి ప్రభుత్వంలోని కేబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ. నెహ్రూ విధానాలతో విసుగు చెందిన ఆయన 1950లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ను కలిసి ఆయన సూచనల మేరకు 1951 అక్టోబర్ 221ననన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు. కాలక్రమంలో అదే భారతీయ జనతాపార్టీగా మారింది.
ఆర్టికల్ 370పై పోరాటం
భారతదేశానికి మకుటమైన జమ్మూ కాశ్మీర్. స్వాతంత్రం తర్వాత భారత్లో జమ్మూకాశ్మీర్ విలీనం విషయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విధానమే కాశ్మీర్ సమస్యకు కారణమన్న శ్యామ ప్రసాద్ ముఖర్జీ అభిప్రాయం. అందుకే జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ప్రధానమంత్రి ఉండటాన్ని శ్యామప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరుప్రధానులు ఉండరాదని గట్టిగా నినదించారు. ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చెలేగా నినాదంతో శ్యామ ప్రసాద్ ఆర్టికల్ 370పై పోరాటం చేశారు.
అనుమానాస్పద రీతిలో మృతి
కాశ్మీర్కు ప్రత్యేక అధికారులు ఇవ్వడంపై శ్యామప్రసాద్ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 1953 మే11న ఎవరి అనుమతి తీసుకోకుండాగానే ఆయన కాశ్మీర్లో అడుగుపెట్టారు. అయితే ప్రధాని నెహ్రూ రహస్య ఆదేశాల మేరకు శ్యామప్రసాద్ను షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై ఎలాంటి కేసులు పెట్టకుండా కోర్టులో హాజరుపరచకుండా జైలుకే పరిమితం చేసింది. దాదాపు నెలన్నర తర్వాత జూన్ 23న శ్యామప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అప్పటికీ 52 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. దీంతో ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
విచారణకు నిరాకరించిన నెహ్రూ
శ్యామ ప్రసాద్ మృతిపై విచారణ జరపాలని ఆయన తల్లి జోగ్మాయా, భారతీయ జనసంఘ్ విజ్ఞప్తి చేసినా నెహ్రూ పట్టించుకోలేదు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ మృతిపై ఎలాంటి విచారణ కమిషన్ ఏర్పాటుగానీ దర్యాప్తుగానీ జరగలేదు. దీంతో ఆయన మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ముఖర్జీ మృతి వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించడం సంచలనం రేపింది. మొత్తమ్మీద కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసి మోడీ సర్కారు నిజమైన నివాళి ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.