స్వంత నియోజకవర్గంలో ములాయంకు చెక్ సాధ్యమేనా,సంక్షోభం బిజెపికి కలిసివస్తోందా
ములాయం సింగ్ స్వంత అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు బిజెపి కసరత్తు చేస్తోంది. పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తమకు కలిసివచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ భావిస్తోంది.
లక్నో :సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో దెబ్బతీసేందుకు బిజెపి పావులు కదుపుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీకి గట్టిపట్టున్న నియోజకవర్గాల్లో అనూహ్యంగా బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు.ఈ ధఫా ఎన్నికల్లో ములాయం స్వంత గడ్డపై తమ జెండా ఎగురవేస్తామని బిజెపి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.జశ్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ వ్యూహం రచిస్తోంది.
ములాయం సింగ్ యాదవ్ స్వంత జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఆ పార్టీ మంచి పట్టుంది.అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కొన్ని స్థానాల్లో అనూహ్యంగా విజయం సాధించింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ తమ అభ్యర్థులు ఇదే తరహ అనూహ్య విజయాలు సాధించేలా ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడ తమకు కలిసివచ్చే అవకాశం ఉందని బిజెపి నాయకులు అంచనావేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సంప్రదాయక ఓటర్లు ఉన్నారు. అయితే పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గుచూపేలా చేస్తాయా లేదా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంత రాజకీయంగా ఆ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం మాత్రం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ములాయంసింగ్ స్వంత అసెంబ్లీ స్థానంలో పట్టుకు బిజెపి కసరత్తు
సమాజ్ వాదీ పార్టీ చీప్ ములాయం సింగ్ యాదవ్ స్వంత గ్రామం సైఫై. ఈ గ్రామం జశ్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది.ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ములాయం సింగ్ యాదవ్ పలు దఫాలు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళకముందు ఆయన ఈ అసెంబ్లీ స్థానం నుండే ప్రాతినిథ్యం వహించాడు.1967 నుండి 1996 వరకు ఈ అసెంబ్లీ స్థానం నుండి ఆయన వరుసగా విజయం సాధించాడు. ఈ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి వ్యూహలు రచిస్తోంది. ఈ స్థానం నుండి ములాయం సింగ్ యాదవ్ తర్వాత ఆయన సోదరుడు శివపాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
2014 ఎన్నికల్లో ఎస్ పి కి చెక్ పెట్టిన బిజెపి
సమాజ్ వాదీ పార్టీకి గట్టిపట్టున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడ గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకొంది. అయితే ఆనాటి పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరుగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆనాడు మోడీని ప్రధానిగా చేయాలనే కోరికతో ఓటర్లు బిజెపికి ఓటుచేశారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు . ఈ కారణంగానే సమాజ్ వాదీ పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో కూడ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఐదు జిల్లాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఈ జిల్లాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు.
మోయిన్ పూరిలో పరువు నిలుకొన్న సమాజ్ వాదీ పార్టీ
ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామం సైఫై. మోయిన్ పూరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. ఈ నియోజకవర్గంలో మాత్రం బిజెపి పాగా వేయలేకపోయింది. ఈ స్థానంలో కూడ పాగా వేసేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు పలించలేదు. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి ములాయం బంధువు తేజ్ ప్రతాప్ సింగ్ (లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు) ఎంపిగా విజయం సాధించాడు.
జశ్వంత్ నగర్ లో సిట్టింగ్ అభ్యర్థే బరిలోకి
సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తండ్రి తనయుడు పోటా పోటీలుగా అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాయి.అయితే ఈ స్థానంలో జశ్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసే అభ్యర్థి పేరును ములాయం సింగ్ , అఖిలేష్ యాదవ్ లు ప్రకటించలేదు. అయితే ఇద్దరూ కూడ ఈ స్థానం నుండి శివపాల్ రంగంలోకి దిగేలా వేరే అభ్యర్థి పేరును ప్రకటించలేదు.
ఇద్దరికీ మద్దతిస్తోన్న ప్రజలు
జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానంలోప్రజలు సమాజ్ వాదీ పార్టీలో తండ్రి తనయులను ఇద్దరినీ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ కొనసాగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయంలో మాత్రం మార్పు విరుద్ద భావనలు లేవు. అదే సమయంలో ములాయం సింగ్ యాదవ్ కు కూడ సముచిత స్థానం కల్పించాలని కోరుకొంటున్నారు. ఇద్దరినీ వారు సపోర్ట్ చేసే పరిస్థితులున్న నేపథ్యంలో తమకు ఈ పరిణామం కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని బిజెపి భావిస్తోంది.