బీహార్ రాజకీయం: బీజేపీకీ దూరంగా జేడీయూ... నితీష్ పార్టీకి మోడీ-షా వేస్తున్న మంత్రం ఏంటి..?
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లులతో ఆది నుంచి మిశ్రమ సంకేతాలు పంపుతోన్న నితీష్ కుమార్ జేడీయూ పార్టీతో బీజేపీ సఖ్యతతో వ్యవహరించాలని భావిస్తోందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుతో జేడీయూలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్తో పాటు ఇతర సీనియర్లు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాదు కేంద్రం దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెప్పగానే ఎన్ఆర్సీ బీహార్లో అమలు చేయమని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. ఇక ఇక్కడి నుంచి బీజేపీ జేడీయూల మధ్య సఖ్యత కాస్త గాడి తప్పినట్లు కనిపిస్తోంది. ఇది గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం జేడీయూను దువ్వే పనిలో పడింది ఇందుకోసం బీజేపీ ఎలాంటి అడుగు వేయనుంది..?
జేడీయూను దువ్వుతున్న బీజేపీ
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు వివాదాస్పద బిల్లులతో జేడీయూ విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇది గ్రహించిన ఆ పార్టీ జేడీయూ దూరం కాకముందే ఆ పార్టీని దువ్వే యత్నం చేస్తోంది. ఇందుకోసం కేంద్రంలో జేడీయూకు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తోంది. కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టేందుకు జేడీయూ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే కేంద్ర కేబినెట్లో జేడీయూ నుంచి ఆ పార్టీ సీనియర్ ఎంపీలు అయిన రాజీవ్ రంజన్ సింగ్ మరియు రామచంద్ర ప్రసాద్ సింగ్లకు కేబినెట్లో చోటు దక్కనున్నట్లు సమాచారం.
బీహార్లో ముక్కోణపు పోటీ లేకుండా చేయడం కోసమే...
జేడీయూకు రెండు కేబినెట్ బెర్త్లు ఇవ్వడం వల్ల రెండు పార్టీల మధ్య బంధం బలోపేతం అవుతుందని భావిస్తోంది బీజేపీ. ఈ ఏడాది బీహార్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీహార్లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని అమిత్ షా చెప్పారు. బీహార్లో ముక్కోణపు పోటీ లేకుండా చేయడమే బీజేపీ టార్గెట్గా ఉందని కమలనాథులు చెబుతున్నారు. ఒకవేళ ముక్కోణపు పోటీ నెలకొంటే ఆర్జేడీ కీలకంగా మారే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఎన్ఆర్సీని నితీష్ సర్కార్ వ్యతిరేకించడంతో బీహార్లోని ప్రతిపక్షాలు తిరిగి ఏకమయ్యే అవకాశం ఉంటుందని ఆశతో ఉన్నారు. అంతేకాదు బీహార్లో సీట్ల పంపకాల విషయానికొస్తే సింహభాగం జేడీయూకే దక్కాలని ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో పార్టీలో విబేధాలు
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు జేడీయూలో విబేధాలు తీసుకొచ్చేలా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రంలో మంత్రి పదవులపై ఆశలు నీరుగార్చేలా ఉన్నాయనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మంత్రి పదవులను జేడీయూ పొందితే ఇక ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై వస్తున్న నిందలకు అర్థం ఉండదని చెబుతున్నారు. ఇక మంత్రి పదవుల విషయానికొస్తే జేడీయూ ఇద్దరిని కేంద్ర కేబినెట్లోకి పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకరు రాజీవ్ రంజన్. అయితే రాజీవ్ రంజన్ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కేంద్ర కేబినెట్లో బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఉన్నారు కనుక రాజీవ్కు ఆ ఛాన్స్ దక్కే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.
మిత్రపక్షాలను కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీ
ప్రస్తుతం బీజేపీకి జేడీయూతో తెగదెంపులు చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ లాంటి అంశాలపై బీజేపీ మిత్రపక్షాల్లో కూడా బేధాభిప్రాయాలు వస్తున్నాయి.ఇక దేశ ఆర్థిక వ్యవస్థ, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ సర్కార్ విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉన్న మిత్రపక్షాలను జాగ్రత్తగా కాపాడుకోవాలనే భావనకు బీజేపీ అధినాయకత్వం వచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ చేరుతుందన్న నమ్మకం బీజేపీకి లేకపోయినప్పటికీ... శివసేన పార్టీ ఎన్డీయేకు గుడ్బై చెప్పడంతో ఆ పార్టీ స్థానంలో జేడీయూతో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న బీజేపీ.... జేడీయూను దువ్వే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.