చక్రం తిప్పుతున్న బిజెపి: గౌతమి ప్రకటన, శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు
జయలలిత మృతి తర్వాత తమిళనాడులో పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. జయలలిత మరణించిన మరుక్షణం నుంచి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళనాడులో చక్రం తిప్పేందుకు బిజెపి వ్యూహరచన చేసినట్లు అర్థమవుతోంది. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిని చేయడం దగ్గరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేయడం వెనక వ్యూహం అదేనని వ్యాఖ్యానిస్తున్నారు.
దక్షిణాదిలో కర్ణాటక అందినట్లే అంది చేజారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి పనిచేసినప్పటికీ అంతగా ఫలితం దక్కడం లేదు.
తెలంగాణలో బిజెపి నామమాత్రంగానే ఉంది. సమీప భవిష్యత్తులో బిజెపి బలపడుతుందని చెప్పడానికి తగిన పరిస్థితులు కూడా లేవు. ఈ విధమైన పరిస్థితుల్లో జయలలిత మరణాన్ని ఆసరా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
గౌతమి లేఖ వెనక మతలబు...
జయలలిత వదిలివెళ్లిన కుర్చీపై కూర్చోవడానికి చిన్నమ్మ శశికళ చక్రం తిప్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినప్పటికీ చివరి నిమిషంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రంగ ప్రవేశం చేసి ఆమె ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని మోడీకి లేఖ రాశారు. మొదటి నుంచీ జయలలిత వద్ద శశికళ మాత్రమే ఉన్నారు కాబట్టి గౌతమి తన లేఖను ఆమెపైకి గురి పెట్టినట్లే భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గౌతమి బిజెపికి చాలా దగ్గర...
సినీ నటి గౌతమి బిజెపికి సన్నిహితురాలనే విషయంం అందరికీ తెలిసిందే. బిజెపిలో చేరాలనే ఉద్దేశంతోనే ఆమె కమలహాసన్కు ఆమె దూరం జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. రాజకీయ రంగు కమలహాసన్పై పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసినట్లు చెప్పారు. గతంలో గౌతమి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కూడా ఆమె కలిశారు. లైఫ్ ఎగైన్ ద్వారా చేస్తున్న సేవల గురించి ఆమె ఆయనకు వివరించినట్లు చెప్పారు. అప్పటి నుంచే ఆమె బిజెపిలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
శేఖర్ రెడ్డిపై ఐటి పంజా..
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంపై, ఇతర వ్యాపారుల నివాసాలపై ఐటి అధికారులు పంజా విసిరారు. 90 కోట్ల రూపాయలను, వంద కిలోల బంగారాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డికి జయలలిత సిఫార్సు మేరకే ఆ పదవి లభించినట్లు చెబుతున్నారు. పన్నీరు సెల్వం ద్వారా శశికళకు దగ్గరైన శేఖర్ రెడ్డి జయలలిత సిఫార్సు మేరకు ఆయనకు పదవి వచ్చినట్లు చెబుతున్నారు. తద్వారా శశికళ, పన్నీరు సెల్వం ప్రతిష్ట దిగజారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
చివరి నిమిషంలో సిఎంగా పన్నీరు సెల్వం
జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. ఆ వ్యూహాన్ని బిజెపి చిత్తు చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు రంగ ప్రవేశం చేసి పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిన చేసినట్లు చెబుతున్నారు. దానివల్ల ఆయనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి ఎత్తులు వేసినట్లు చెబుతున్నారు.