బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగిసింది. ఎల్లుండి 71 అసెంబ్లీ సీట్లలో జరిగే ఎన్నికల కోసం ముమ్మరంగా ఎన్డీయే, మహాకూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తమ మిత్రపక్షం జేడీయూకు బీజేపీ షాకిచ్చింది. ఇప్పటికే ఎన్డీయేలో ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముంది.
బీజేపీ రాష్ట్రంలో తాజాగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో కేవలం ప్రధాని నరేంద్రమోడీ లైఫ్ సైజ్ ఫొటోను మాత్రమే ఉంచారు. ఎన్డీయే కూటమి తరఫున సీఎం అభ్యర్ధిగా ఉన్న జేడీయూ నేత నితీశ్కు మాత్రం ఈ పోస్టర్లలో స్ధానం కల్పించలేదు. తద్వారా ఈ ఎన్నికలకు తాము ప్రధాని మోడీ బొమ్మతోనే వెళ్తున్నట్లు బీజేపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పటికే నితీశ్ కుమార్కు సీఎంగా ఎప్పటినుంచో మద్దతిస్తున్న బీజేపీ నేతలకు ఈసారి ఆయన స్ధానంలో తమ పార్టీ అభ్యర్ధిని సీఎం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు అనుగుణంగా కదుపుతున్న పావుల్లో భాగంగానే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా బీజేపీ ఏర్పాటు చేసిన పోస్టర్లలో నితీశ్ ఫొటో కనిపించలేదు. ఎన్డీయే కూటమిగా ఇరుపార్టీలు పోటీ చేస్తున్నప్పుడు మిత్రపక్ష ధర్మం ప్రకారం చూసినా ప్రధాని మోడీతో పాటు నితీశ్ కుమార్ ఫొటో వేయాల్సి ఉంది. కానీ బీజేపీ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తొలిదశ ఎన్నికలకు ముందు నితీశ్కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే నితీశ్ను దెబ్బతీసేందుకు చిరాగ్ పాశ్వాన్ను విడిగా రంగంలోకి దింపిన బీజేపీ.. ఇప్పుడు తమ నేతను పోస్టర్లపై కూడా వేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం పట్ల జేడీయూ శ్రేణులు మండిపడుతున్నాయి.