మెజారిటీ లేని సీఎం రాజీనామా చెయ్యాలి, భ్రమలో ఉన్నారా ? మాజీ సీఎం, రెబల్ ఎమ్మెల్యేలు !
బెంగళూరు: మెజారీ ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో సంపూర్ణంగా విఫలం అయిన ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే రాజీనామా చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక శాఖ బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు స్పష్టం అయిన తీర్పు ఇచ్చింది, ఆయన ఒక్కరోజు తరువాత అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి ఎలా సిద్దం అవుతున్నారో అర్దం కావడం లేదని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అన్నారు. ఇప్పటికీ తనకు మెజారిటీ ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని సీఎం కుమారస్వామి భ్రమలో ఉన్నారని మాజీ సీఎం యడ్యూరప్ప ఎద్దేవ చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు తరువాత కుమారస్వామి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నారా ? అని బీఎస్ యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు. స్పీకర్ రమేష్ కుమార్ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని బీఎస్, యడ్యూరప్ప చెప్పారు.
స్పీకర్ నిర్ణయం తీరువాత తాము ఏం చెయ్యాలో ఆలోచిస్తామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి వేచి చూడకుండా సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చెయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టర్ డిమాండ్ చేశారు.
బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సీఎం కుమారస్వామి మీద, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి లేదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చెప్పారు.
మెజారీ ఎమ్మెల్యేల మద్దతు లేని సీఎం కుమారస్వామి రాజీనామా చెయ్యడమే మంచిదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేస్తే మర్యాదగా ఉంటుందని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప అన్నారు.
ఈ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, వెంటనే ఇంటికి పోవడం వారికే మంచిదని కేఎస్. ఈశ్వరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి రాజీనామా చెయ్యాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సీఎం కుమారస్వామి సిద్దం అవుతారా ? లేక ముందుగానే రాజీనామా చేస్తారా అనే విషయం వేచిచూడాలి.