"మహా" సంగ్రామం: బీజేపీ గెలుపుగుర్రాలు.. సౌత్ వెస్ట్ నాగ్పూర్ నుంచి ఫడ్నవీస్..
ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల సందడి జోరందుకుంది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తమ రేసుగుర్రాల పేర్లను ప్రకటించింది. అక్టోబర్ 21న జరిగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లకు సంబంధించిన తొలిజాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన... పార్టీ పోటీ చేసే స్థానాల జాబితాను విడుదల చేసింది. దీంతో మహారాష్ట్రలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.
కాంగ్రెస్ కు షాక్: మేయర్ పదవి కూడా పాయే: ఎగిరిన కాషాయ జెండా
తొలిజాబితాను విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్రలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ కదనరంగంలోకి అడుగుపెట్టనుంది. తిరిగి మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. ఇందులో పలువురు ప్రముఖలు ఉన్నారు. సౌత్ వెస్ట్ నాగ్పూర్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీచేస్తున్నారు. కోతుర్ద్ నుంచి చంద్రకాంత్ పాటిల్ పోటీ చేస్తుండగా... సతారా నుంచి శివేంద్ర సింగ్ బరిలో దిగుతున్నారు. అయితే తొలి జాబితాలో కొందరి ప్రముఖుల పేర్లు మిస్ అవుతుండటం కాస్త ఆసక్తికరంగా మారింది. ఇందులో వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖాడ్సే, సుధీర్ ముంగంతివార్ల పేర్లు తొలిజాబితాలో కనిపించలేదు.
12 మంది సిట్టింగ్లకు దక్కని ఛాన్స్
ఇక తొలిజాబితాను జాగ్రత్తగా పరిశీలిస్తే 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించలేదు బీజేపీ. మరో 91 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఐదుమంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు, మరో ఇండిపెండెంట్ల పేర్లు తొలిజాబితాలో కనిపించాయి. శివసేనతో పొత్తు కుదిరిన తర్వాత తొలిజాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఆర్పీఐ, ఆర్ఎస్పీలు కలిసి పోటీచేస్తున్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను విడుదల చేసిన శివసేన
ఓ వైపు బీజేపీ తమ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేయగా... శివసేన కూడా మరో జాబితాను విడుదల చేసింది . అయితే ఇది అభ్యర్థుల జాబితా కాదు. ఆ పార్టీ పోటీచేస్తున్న 124 స్థానాలకు సంబంధించిన లిస్టును రిలీజ్ చేసింది. దీంతో ఆ స్థానాలకు బీజేపీ గుడ్బై చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే శివసేన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏబీ ఫారం అందజేసినప్పటికీ ఇప్పటి వరకు వారి పార్టీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు.
బీజేపీ కోటాలో రెండు ఎమ్మెల్సీలను కోరిన శివసేన
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 125 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా 124 స్థానాల్లో శివసేన బరిలో దిగనుంది. ఇక మిగిలిన 39 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీకి దిగనున్నాయి. 124 సీట్లతో పాటు బీజేపీ కోటాలో రెండు ఎమ్మెల్సీలను శివసేన కోరింది. దీనికి కూడా బీజేపీ ఓకే చేసింది. ఇదిలా ఉంటే 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా శివసేన బీజేపీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చెరో సగం సీట్లలో పోటీచేద్దామని ఆ సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమవడంతో రెండూ సొంతంగా పోటీచేశాయి. బీజేపీ 122 స్థానాలు దక్కించుకోగా.. శివసేన 63 స్థానాల్లో విజయం సాధించింది.