బీజేపీ రెండో జాబితా విడుదల, బెంగళూరు, బళ్లారిలో అభ్యర్థులు, వలస పక్షులకు చాన్స్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీ జరగనున్నాయి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 218 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది. ఇప్పటికే జేడీఎస్ పార్టీ 120 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ సైతం ఇప్పటికే 72 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిచింది. సోమవారం బీజేపీ 82 అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
బెంగళూరులో వీరే
బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో బెంగళూరు నగరంలోని ఆరు శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. కేఆర్ పురంలో నందీష్ రెడ్డి, బ్యాటరాయణపురలో ఏ. రవి, శివాజీనగరలో మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యనాయుడు, శాంతినగరలో వాసుదేవమూర్తి, విజయనగరలో హెచ్. రవీంద్ర, మహాలక్ష్మి లేఔట్ లో ఎన్ఎల్. నరేంద్రబాబుకు టిక్కెట్లు కేటాయించారు.
Recommended Video
వలస పక్షులకు టిక్కెట్లు
కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు ముందుగా ఇచ్చిన హామీ మేరకు వారికి టిక్కెట్లు ఇచ్చారు. గెపులుగుర్రాలకు రెండో జాబితాలో అవకాశం ఇచ్చారు. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.
బళ్లారిలో ఆయనకే !
బీజేపీ బళ్లారిలో ఎవరికి టిక్కెట్లు కేటాయిస్తుందని అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బళ్లారిలో సణ్ణ ఫకీరప్పకు టిక్కెట్ ఇచ్చారు. ఇక బళ్లారి సిటీ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి అవకాశం కల్పించారు.
మూడో జాబితాలో చాన్స్
బీజేపీ 154 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన శాసస సభ నియోజక వర్గాల్లోని అభ్యర్థులను మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఐదు నియోజక వర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
గాలి సోదరుడు
గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికి బళ్లారి సిటీ సీటు కేటాయించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి మరో సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి నియోజక వర్గం పరప్పనహళ్ళిలో అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కొంత కాలంగా గాలి కరుణాకర్ రెడ్డి ఆయన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు.