ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటన
ఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులుగా బీజేపీ తమ ఐదవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా... కేరళ ఒక స్థానం, ఉత్తర్ ప్రదేశ్కు మూడు స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి జేపీ నడ్డా. ఈ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఇందులో ఒక ఎస్టీ స్థానానికి మూడు ఎస్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగతావి జనరల్ స్థానాలుగా ఉన్నాయి.
తెలంగాణ విషయానికొస్తే అదిలాబాద్ (ఎస్టీ) నుంచి సోయం బాబురావు, పెద్దపల్లి (ఎస్సీ) ఎస్.కుమార్, జహీరాబాదు నుంచి బానాల లక్ష్మణ్ రెడ్డి, హైదరాబాదు స్థానం నుంచి డాక్టర్ భగ్వంత్ రావు, చేవెళ్ల నుంచి బి. జనార్థన్ రెడ్డి, ఖమ్మం నుంచి వాసుదేవ్ రావుల పేర్లను ప్రకటించింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ నుంచి కైరానా నుంచి ప్రదీప్ చౌదరి, నాగిన(ఎస్సీ) నుంచి డాక్టర్ యశ్వంత్, బులంద్షహర్ (ఎస్సీ) నుంచి భోలా సింగ్ల పేర్లు ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్ జంగీపూర్ నుంచి మఫుజా ఖాతున్ పేర్లను ప్రకటించింది. ఇక కేరళలో ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారిన పట్టణంతిట్ట నియోజకవర్గానికి కె. సురేంద్రన్ పేరును ప్రకటించింది బీజేపీ.
అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్
పట్టణంతిట్ట నియోజకవర్గం ఈ మధ్యకాలంలో ప్రధాన వార్తల్లో నిలిచింది. శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తీర్పుపై పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఇక అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పలువురు హిందూ సంఘాలకు చెందిన భక్తులు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేరళ ప్రభుత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పునే అనుసరిస్తామని తేల్చేసింది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తలకు భద్రత కల్పించింది. మరి ఈ స్థానం నుంచి సురేంద్రన్ను బీజేపీ బరిలో నిలబెడుతుండటం విశేషం.