ఆ ఇద్దరు ఎంపీలు లిస్ట్ నుంచి ఔట్: ఈసీ ఆదేశాలకు స్పందించిన బీజేపీ..!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు లోక్సభ సభ్యులపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారుల ఆదేశాల మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వారిద్దరి పేర్లను తొలగించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన వద్దని సూచించింది. ఆ ఇద్దరు లోక్సభ సభ్యులు- అనురాగ్ ఠాకూర్, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వారిద్దరి పేర్లను తొలగిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
వారు చేసిన వ్యాఖ్యలేంటీ?
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద ఆందోళన చేస్తోన్న ప్రదర్శనకారులను ఉద్దేశించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులను అలాగే వదిలి వేస్తే.. ఇంట్లోకి చొరబడి.. అక్క చెల్లెళ్లు, భార్యలపై అత్యాచారానికి పాల్పడుతారని, హత్య చేసి వెళ్తారనీ వ్యాఖ్యానించారు.
ఆందోళనకారులను షూట్ చేయాలి..
అత్యాచారాలను ఆపడానికి, బాధితులను కాపాడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాలేరని, ప్రజలే ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని అన్నారు. అలాగే- ఢిల్లీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులను నెల రోజుల్లో కూల్చేస్తామని పర్వేశ్ వర్మ హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ, జాతీయ పౌర నమోదు కార్యక్రమాన్ని గానీ వ్యతిరేకించే వారిని కాల్చి వేయాలని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఈసీ దృష్టికి
ఈ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాయి. ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. ఇదివరకే వారిద్దరికీ నోటీసులను జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వారు ఇచ్చిన వివరణతో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు సంతృప్తి చెందలేదు. దీనితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ పేర్లను తొలగించాలని బీజేపీని ఆదేశించింది.