వీడియో వైరల్: అమేథీలో అగ్నిప్రమాదం... మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్మృతీ ఇరానీ
అది అమేథీ నియోజకవర్గం... ప్రచారంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. పురాబ్ ద్వారా గ్రామంలో ఆమె కాన్వాయ్ వెళుతోంది. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ ఆగింది. స్మృతీ ఇరానీ అందులోనుంచి బయటకు దిగి పరుగులు తీసింది. ఇంతకీ ఆమె పరుగులు తీసింది ప్రచారం చేసుకోవడానికి కాదు... మరి ఎందుకు పరుగులు తీశారు..?
అమేథీ నియోజకవర్గంలో అగ్నిప్రమాదం
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అసలే అమేథీ నుంచి పోటీచేస్తున్న స్మృతీ ఇరానీకి అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమె ప్రత్యర్థి. అమేథీ నియోజకవర్గం పురాబ్ ద్వారా గ్రామం గుండా వెళుతున్న స్మృతీ ఇరానీ కంట అగ్ని ప్రమాదం సంభవించిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే కాన్వాయ్ను ఆపమని చెప్పి వాహనంలో నుంచి దిగి ఆమె ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరుగులు తీశారు. అగ్ని కీలలు ఎగిసిపడుతుండటంతో ఆమె తన వంతు సహాయం చేశారు.
ప్రమాదం గమనించి తనవంతు సహాయం చేసిన స్మృతీ ఇరానీ
అగ్నికీలలు ఎగిసిపడుతుండటం చూసిన స్మృతీ ఇరానీ వెంటనే అక్కడ బోరింగ్ ఉండటం చూసి ఆమె నీళ్లు పట్టారు. నీళ్లు తీసుకుని గ్రామస్తులు పరుగులు తీసి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఇరానీ ఓదార్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమాచారం ఉన్నప్పటికీ అక్కడి సిబ్బంది స్పందించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్, ప్రియాంకలపై స్మృతీ విమర్శలు
అమేథీలో పోటీచేస్తున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించదన్న ప్రియాంకా గాంధీ విమర్శలపై మండిపడ్డారు స్మృతీ ఇరానీ. తను ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటిస్తున్నానో అదైనా ప్రియాంకా గాంధీ లెక్కలేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని స్మృతీ ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ గత 15 ఏళ్లుగా కనిపించలేదని అందుకే తను ఎన్నిసార్లు నియోజకవర్గం పర్యటనకు వచ్చిందనేదానిపై ప్రియాంకా లెక్కలేసుకుంటున్నారని స్మృతీ అన్నారు.ఇప్పటి వరకు అమేథీ ప్రజల కష్టాల గురించి, అమేథీ అభివృద్ధి గురించి రాహుల్ గాంధీ పార్లమెంటులో ఒక్కసారి కూడా నోరుమెదకపోవడం దారుణమని విమర్శించారు. గత ఐదేళ్లుగా ప్రధానిని విమర్శించడంలో పెట్టిన దృష్టి అమేథీపై పెట్టిఉంటే బాగుపడేదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ బాధితులను పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రతి ఏటా ఎండవేడిమికి కనీసం 500 ఇళ్లు ఈ నియోజకవర్గంలో తగలబడిపోతున్నాయి కానీ ఇక్కడ ఎంపీ మాత్రం తనకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలే దగ్గరుండి సహాయసహకారాలు అందిస్తున్నారని స్మృతీ ఇరానీ కొనియాడారు.
ఇక అగ్నిప్రమాదం సంభవించడంతో దాదాపు 100 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లింది. ఇది చూసిన గ్రామస్తులు లబోదిబోమన్నారు. వారిని స్మృతీ ఇరానీ ఓదార్చారు. ఆ తర్వాత బాధితులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ కూడా పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో 100 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని అగ్నికి ఆహుతై ఒక వ్యక్తి మృతి చెందినట్లు పల్లవిసింగ్ అనే తాహసీల్దారు తెలిపారు. ఇదిలా ఉంటే సాయంత్రం 5:30 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.