కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రి
సిమ్లా : ఎన్నికల బరిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. భార్య ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే.. భర్త మరో పార్టీ తరపున బరిలోకి దిగుతారు. అత్తా కోడళ్లు, మామాఅల్లుళ్లు, బావబామ్మర్దులు.. ఇలా బంధాలకు అతీతంగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతుంటారు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి అనిల్ శర్మ కొడుకు ఆశ్రయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి తాను ప్రచారం చేయలేనంటూ అనిల్ శర్మ పార్టీ నేతలకు చెప్పడం చర్చానీయాంశంగా మారింది.
ఇల్లిల్లు తిరుగుడేంది భాయ్..! స్టైల్ మారిన ప్రచారం.. ఓటర్లకు గాలం
చిత్రం విచిత్రం
మండి పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు ఆశ్రయ్ శర్మ. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రామస్వరూప్ మరోసారి పోటీకి సై అంటున్నారు. ఆశ్రయ్ శర్మ తండ్రి అనిల్ శర్మ (మంత్రి) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మండి అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే లోక్సభ పరిధిలో ఉండటం గమనార్హం. అయితే బీజేపీ నుంచి మంత్రి పదవి దక్కించుకున్న అనిల్ శర్మ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారా లేదంటే ఆయన కొడుకు వైపు మొగ్గు చూపుతారా అనేది ట్విస్ట్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయలేనంటూ పార్టీ నేతలను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొడుకు సెంటిమెంట్..!
కొడుకు బరిలోకి దిగిన మండి పార్లమెంట్ స్థానంలో ప్రచారం చేయబోనంటున్నారు అనిల్ శర్మ. బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన ఇతర నియోజకవర్గాల అభ్యర్థులకు మాత్రం ప్రచారం చేస్తానని చెబుతున్నారు. కన్న కొడుకు పోటీలో ఉండటంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. పార్టీ పెద్దలకు అర్థమయ్యే విధంగా తన పరిస్థితి వివరించానని తెలిపారు.
ఆ ఫ్యామిలీలో ట్విస్టులెన్నో..!
తండ్రీ కొడుకుల విషయంలో చాలా ట్విస్టులున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించిన అనిల్ శర్మ 2017లో కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన కొడుకు మండి సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామస్వరూప్ కే మరోసారి టికెట్ ఇచ్చారు పార్టీ పెద్దలు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆశ్రయ్ శర్మ వెంటనే రూట్ మార్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ క్రమంలో మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది.