సుపారీ ఇచ్చి మరీ రెచ్చగొట్టారు.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి: బీజేపీ డిమాండ్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో నెలకొన్న హింసాత్మక ఘటనలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి, అస్నాసోల్ ఎంపీ బాబుల్ సుప్రియో ఈ డిమాండ్ చేశారు.
సుపారీ ఇచ్చి రెచ్చగొట్టారు:
రాష్ట్రంలో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యాంగ సూత్రాలను పట్టించుకోవడం లేదని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోందని సుప్రియో ఆరోపించారు. టీఎంసీ ఓ రౌడీల పార్టీ అని, అందుకే ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు తనకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం సుపారీలు ఇచ్చి మరీ ఎన్నికల్లో హింసను రెచ్చగొట్టిందన్నారు.
రాష్ట్రపతి పాలన విధించండి:
టీఎంసీ ప్రభుత్వానికి సిగ్గు లేదని, నైతికత అంతకన్నా లేదని ఆరోపించారు. అందుకే బెంగాల్ లో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని, అప్పుడే బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా ఉంగలుగుతారని అన్నారు. అధికారం బలంతో ఓటర్లను ప్రలోభ పెట్టడమే కాకుండా.. బీజేపీ కార్యకర్తలపై కర్రలు, ఇనుప రాడ్లతో బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ నేతపై దాడి:
పంచాయితీ ఎన్నికల సందర్భంగా కూచ్బెహర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మంత్రి రవీంద్రనాథ్ ఘోష్ ఓ ఏజెంట్ పై బీజేపీ ఏజెంట్ పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనను రవీంద్రనాథ్ సమర్థించుకోవడం గమనార్హం. 'బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నా.. కొంతమంది ప్రజలు అతన్ని విడిచిపెట్టమని పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో వాళ్లను చేతులతో వెనక్కి నెట్టాను అంతే' అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
ఐదుగురు మృతి:
బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన చెలరేగిన ఘర్షణలో మొత్తం ఐదుగురు ఓటర్లు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు. ముషీరాబాద్లోని పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, టీఎంసీ మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్యాలెట్ పత్రాలను పక్కనే ఉన్న కాలువలో పడేయడంతో.. అధికారులు అక్కడ పోలింగ్ నిలిపివేశారు.