బీహరీలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్: హామీని మరోసారి సమర్థించిన నిర్మలా.. ఇదే కారణం..
బీహర్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో దుమారం చెలరేగింది. అయితే మేనిఫెస్టో విడుదల చేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం.. ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరస్తామని స్పష్టంచేశారు.
హామీపై విపక్షాలు ఒంటికాలిపై లేవగా.. నిర్మలా సీతామరామన్ స్పందించారు. ఆరోగ్యం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక పార్టీ దానికి సంబంధించిన ప్రకటన చేయొచ్చు అని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే హక్కు పార్టీలకు ఉంటుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రతీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తోందని.. అందులో తాము చేసే కార్యక్రమాలను వివరిస్తోందని తెలిపారు.
బీజేపీ హామీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తప్పుపట్టారు. శివసేన అయితే విరుచుకుపడింది. కరోనా వ్యాక్సిన్ బీహరీలకు ఇస్తామని చెబుతున్నారు.. మరీ ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి.. దేశంలోనా.. పాకిస్తాన్లోనా అని 'సామ్నా'లో విరుచుకుపడింది. దేశంలో అన్నీ రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నది. కరోనా వైరస్ ఒక్క బీహర్లోనే లేదని.. దేశవ్యాప్తంగా ఉందని తెలిపింది.
బీహర్లో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీన ఎన్నికలు ప్రారంభమవుతాయి. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. విజయం కోసం ప్రధాన పార్టీల అధినేతలు ఓటరు మహాశయులకు హామీల జల్లు కురిపిస్తున్నారు.