యోగి ఆదిత్యనాథ్ను దెబ్బకొట్టింది వీరే!: మాయా-అఖిలేష్ కలిస్తే, బీజేపీ ఓడిందిలా...
లక్నో: ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈశాన్యం వైపు దూసుకెళ్లి, అటు నుంచి దక్షిణాది వైపు దృష్టి సారించిన బీజేపీకి ఉప ఎన్నికల్లో షాకులు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన వరుస లోకసభ స్థానాల్లో బీజేపీ ఓటమి చవి చూస్తోంది.
చదవండి: గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
దీంతో 2019లో 350 సీట్ల టార్గెట్ పెట్టుకున్న బీజేపీకి ఆ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. తాజాగా యూపీ, బీహార్లలో మూడింట ఓడిపోవడం బీజేపీ నేతలు జీర్ణించుకోవడం లేదు.
అవే రాష్ట్రాల్లో ఎదురుగాలి
2014 లోకసభ ఎన్నికల్లో యూపీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే బీజేపీ 200 లోకసభ స్థానాలకు గాను 171 గెలుచుకుంది. దీంతో 282 స్థానాలు బీజేపీకి దక్కాయి. కానీ ఇప్పుడు అవే రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తోంది. కంచుకోట వంటి గోరక్పూర్లో ఓడిపోవడం ఆ పార్టీ జీర్ణించుకోలేని విషయమే.
విపక్షాలు ఒక్కటై బీజేపీని ఓడిస్తున్నాయి
దేశవ్యాప్తంగా దూసుకెళ్తున్న బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ తమ దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయి. బీహార్లో విపక్షాలు ఒక్కటై బీజేపీని ఓడించాయి. ఇప్పుడు యూపీ ఉప ఎన్నికల్లోను అదే జరిగింది. ఎస్పీ, బీఎస్పీ కలవడం గమనార్హం.
జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం
విపక్షాలు కలవడానికి తోడు నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం ప్రజల్లో ఆగ్రహం ఉందనేందుకు తాజా ఉప ఎన్నికలు నిదర్శనం అంటున్నారు. 2014లో ఎస్పీ, బీఎస్పీలు వేర్వేరుగా పోటీ చేసి, ఇప్పుడు ఏకమయ్యాయి. అప్పుడు మోడీ హవాతో బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ మోడీ హవా ఉన్నప్పటికీ.. భారత భవిష్యత్తుకు ఊతమిస్తాయని భావిస్తున్న జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోంది.
బీఎస్పీ, ఎస్పీల ఓట్ల శాతం ఇలా
ఇదిలా ఉండగా, 2014లో ఎస్పీ, బీఎస్పీలు వేర్వేరుగా పోటీ చేసి పుల్పూర్లో 37.4 శాతం, గోరక్పూర్లో 38.8 శాతం ఓట్లు సాధించాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీలు జంటగా పోటీ చేసి 46.9 శాతం, 48.9 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల కంటే దాదాపు పది శాతం ఎక్కువ.
బీజేపీ ఓట్ల శాతం ఇలా
2014లో బీజేపీకి పుల్పూర్లో 52.4 శాతం, గోరక్పూర్లో 51.8 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 38.8 శాతం, 46.6 శాతం ఓట్ల వచ్చాయి. గోరక్పూర్లో గతంలో కంటే కేవలం 5 శాతం దాకా ఓట్లు మాత్రమే తగ్గాయి. పుల్పూర్లో మాత్రం 13 శాతం మేర తగ్గాయి. బీహార్లోని అరారియాలోను బీజేపీ-జేడీయుకు కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి.
వారే కారణం.. యోగిపై ఇలా దెబ్బపడింది
గోరక్పూర్ నియోజకవర్గంలో దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీదే హవా. ఇప్పుడు అక్కడ ఎస్పీ గెలిచింది. ఓటమికి ఇక్కడ ప్రధానంగా ఉండే నిషద్లు, మల్లాలు కారణంగా చెబుతున్నారు. గోరక్పూర్లో 19.5 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 4.5 లక్షల వరకు నిషద్లు మల్లాల ఓట్లు ఉన్నాయి. 18 శాతం ముస్లీంలు. వీరి ఓట్లు చీలకుండా ఎస్పీ, బీఎస్పీలు కలవడమే దెబ్బకొట్టిందని అంటున్నారు.