‘చలో పల్టాహై’ అంటే ఇలా: లెనిన్ విగ్రహాల కూల్చివేత.. ఇద్దరు సీపీఎం కార్యకర్తల హత్య
అగర్తల/న్యూఢిల్లీ: త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన 48 గంటల్లోపే వారి రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోయారు. భారీగా హింసాకాండకు దిగి కారల్ మార్క్స్, లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. సీపీఎం కార్యాలయాలపై, ఆ పార్టీ కార్యకర్తల ఇండ్లపై దాడులు, దహనాలకు పాల్పడ్డారు. ఈ హింసలో ఇద్దరు మృతి చెందినట్టు తెలిసింది.
బెలోనియా జిల్లా కేంద్రంలోని పబ్లిక్ స్కేర్లో ఉన్న ఐదడుగుల లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్తో సోమవారం కూల్చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కాషాయ చొక్కాలు ధరించిన బీజేపీ కార్యకర్తలు 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేస్తూ విగ్రహం కూల్చివేతలో పాల్గొన్నారు.
విధ్వంసకాండతో బీజేపీ త్రిపుర విజయోత్సవాలు
త్రిపుర దక్షిణ ప్రాంతంలోని బెలోనియా పట్టణం నడిబొడ్డున లెనిన్ విగ్రహం ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపొందాక వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని నిర్మించారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి విజయం నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు దాదాపు 200 మంది లెనిన్ విగ్రహం వద్ద గుమిగూడారు. జేసీబీ సహాయంతో 11.5 అడుగుల ఫైబర్ గ్లాస్తో తయారుచేసిన కార్మిక వర్గ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు.'విగ్రహం కిందపడిన తర్వాత దాని నుంచి తల భాగాన్ని వేరు చేశారు. కార్మిక నేత లెనిన్ తల భాగాన్ని తీసుకొని బీజేపీ కార్యకర్తలు ఫుట్ బాల్ ఆడుకున్నారు' అని ఆ ఘటన ప్రత్యక్ష సాక్షి తపస్దత్తా చెప్పారు. జేసీబీ డ్రైవర్ అశీశ్ పాల్ను అరెస్టు చేశామని, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశామని దక్షిణ త్రిపుర పోలీసు ఇన్స్పెక్టర్ ఇప్పర్ మోన్చెక్ తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ ఆదేశం
తమ కార్యాలయాలు, ఇండ్లలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారని సీపీఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శి హరిపాద దాస్ ఆరోపించారు. ఇండ్లు, ఆఫీసులకు నిప్పంటించారని అన్నారు. దీంతో పలు చోట్ల మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలోని సున్నిత ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నేపథ్యంలో త్రిపుర గవర్నర్ తథాగథ రాయ్తో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దాడులు నియంత్రించాలని ప్రధానికి సీపీఎం ఎంపీ సలీం వినతి
లెనిన్ విగ్రహం కూల్చివేతకు నిరసనగా దేశవ్యాప్త ప్రదర్శనలు జరుపాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. త్రిపురలో జరుగు తున్న రాజకీయ హింసకు బీజేపీ కారణమని ఆరోపించారు. మరోవైపు త్రిపురలో తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ దాడులను నివారించేందుకు జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మన దేశంలో ఆయన విగ్రహమెందుకన్న సుబ్రమణ్యస్వామి
లెనిన్ విగ్రహ ధ్వంసంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'లెనిన్ ఒకరకమైన తీవ్రవాది, ఆయన విగ్రహం భారతదేశంలో అవసరమేంటి? సీపీఐ(ఎం) కావాలనుకుంటే ఆయన విగ్రహాన్ని తన పార్టీ ప్రధాన కార్యాలయంలో పెట్టుకొని పూజలు చేసుకోవాలి.. తప్ప బయటకాదు' అని స్వామి వ్యాఖ్యానించారు. 'లెనిన్ విదేశీయుడు. రష్యాలో నియంతృత్వ పాలన కోసం అనేక మందిని ఆయన హతమార్చాడు. అటువంటి ఉగ్రవాదుల విగ్రహాలను మనదేశంలో నిలబెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు?' అని స్వామి ప్రశ్నించారు.
పదండి మార్చేదామని రాం మాధవ్.. ఆ పై తొలిగింపు
వ్రిగ్రహాల కూల్చివేతపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ‘ప్రజలు లెనిన్ విగ్రహాన్ని తొలిగిస్తున్నారు.. ఇది రష్యాలో కాదు, త్రిపురలో. చలో పల్టాయి (మార్చేద్దాం పదండి' అని ట్వీట్ చేశారు. తరువాత దానిని తొలిగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, ఆరెస్సెస్ విస్తరణకు తీవ్రంగా క్రుషి చేసిన నేతల్లో రాం మాధవ్ ఒకరు.
రాజస్థాన్ హైకోర్టులో మను విగ్రహం కూల్చివేత సబబేనని ఆశాభావం
త్రిపురలో
బీజేపీ
కార్యకర్తలు
లెనిన్
విగ్రహాన్ని
కూల్చేసినట్లు
వచ్చిన
వార్తలపై
గుజరాత్
రాష్ట్రానికి
చెందిన
దళిత
నాయకుడు,
ఎమ్మెల్యే
జిగ్నేశ్
మేవానీ
తీవ్రంగా
మండిపడ్డారు.
‘ఒకవేళ
త్రిపురలోని
ఒక
పట్టణంలోని
లెనిన్
విగ్రహాన్ని
కూల్చేశారన్న
వార్త
నిజమైతే.
రాజస్థాన్
హైకోర్టు
ఆవరణలోని
‘మను'
విగ్రహం
కూల్చివేత
కూడా
సబబే'
అని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
విగ్రహాల కూల్చివేతలతో బీజేపీ - ఆరెస్సెస్ పాత్ర ఉందని మమత ఆరోపణ
త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేతను పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఖండించారు. ఇటువంటి హింసాత్మక చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘లెనిన్ మా నేత కాదు. కానీ రష్యాలో కీలక భూమిక పోషించిన నేత. సీపీఎం మాకు ప్రత్యర్థి కావచ్చు. అంతమాత్రాన మార్క్స్, లెనిన్ విగ్రహాల కూల్చివేతను అనుమతిస్తాననుకోవద్దు'అని ఆమె హెచ్చరించారు. లెనిన్ విగ్రహాల కూల్చివేతలో బీజేపీ-ఆరెస్సెస్ పాత్ర ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఒక దిగ్గజ నాయకుడి విగ్రహాలను కూల్చివేయడం సరికాదన్నారు.
భారతదేశంలో సిద్దాంతకర్తలకు కొదవ లేదన్న కేంద్రమంత్రి గంగారాం అహిర్
లెఫ్ట్ పార్టీల వల్ల అణచివేతకు గురైన వారే ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడి ఉంటారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. లెనిన్ విగ్రహం కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారంతా అయోధ్య, మథుర, వారణాసి (కాశీ)లతోపాటు పలు ప్రాంతాల్లో వేల దేవాలయాలను కూల్చివేస్తున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ మాట్లాడుతూ భారత్లో విదేశీ నేతల విగ్రహాలకు చోటు లేదన్నారు. భారత్లో సిద్ధాంతకర్తలకు కొదవలేదన్నారు.
గవర్నర్ వ్యాఖ్యలు రాజ్యంగ పదవుల స్థాయి తగ్గిస్తాయన్న గవర్నర్
విగ్రహాల కూల్చివేతను త్రిపుర గవర్నర్ తథాగథ్ రాయ్ సమర్థించారు. ‘ఒక ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం చేసిన పనిని.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మరో ప్రభుత్వం రద్దు చేయవచ్చు' అని చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. అంతకుముందు పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన తథాగథ రాయ్.. బీజేపీ కార్యకర్తలు విగ్రహాన్ని కూల్చేస్తున్న బీజేపీ కార్యకర్తల ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేయడం కూడా వివాదాస్పదమైంది. తథాగథ రాయ్ ట్వీట్పై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, రాజ్యాంగ పదవుల స్థాయిని తగ్గిస్తున్నారని ఇది స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్న సురవరం
ఒక పథకం ప్రకారమే విగ్రహాల కూల్చివేతకు బీజేపీ పాల్పడుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. విదేశీ నేతల విగ్రహాలకు భారత్లో చోటు లేదన్న మంత్రి హన్స్రాజ్ అహిర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మహాత్మా గాంధీ విగ్రహాలు అనేక దేశాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యమైనవి కావని సీపీఐ నేత డి రాజా అన్నారు. త్రిపురలో హింసాత్మక ఘటనలను ఆయన ఖండించారు. 'మన దేశం బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓ పార్టీ గెలిస్తే.. మరోసారి మరో పార్టీ గెలుస్తుంది. దానర్థం విగ్రహాలను కూల్చివేసి విధ్వంసం సృష్టించాలని కాదు. చట్టం తన పని తాను చేయాలి' అని రాజా అన్నారు.