ఎన్నికల బరిలోనూ ఎదురు లేని ఆటగాళ్లు.. గెలుపు బాటలో టిక్ టాక్ స్టార్ కూడా!
చండీగఢ్: క్రీడారంగంలోనే కాదు.. ఎన్నికల బరిలో కూడా ఎదురు లేకుండా సాగుతున్నారు ఆటగాళ్లు. వారే యోగేశ్వర్ దత్, బబితా ఫొగట్, సందీప్ సింగ్. రెజ్లింగ్ లో భారత్ రజత పతకాన్ని అందించిన యోగేశ్వర్ దత్, మహిళా రెజ్లర్ బబితా ఫొగట్, భారత హాకీ జట్టు మాజీ కేప్టెన్ సందీప్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో వారిద్దరూ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ తమ తమ సమీప ప్రత్యర్థులపై పైచేయి సాధించారు భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. వారితో పాటు టిక్ టాక్ స్టార్ గుర్తింపు పొందిన సొనాలి ఫొగట్ కూడా గెలుపు బాటలో ఉన్నారు.
యోగేశ్వర్ దత్, బబితా ఫొగట్ హర్యానా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఎన్నికల బరిలో దిగడానికీ వెనుకాడలేదు. యోగేశ్వర్ దత్ బీజేనీ అభ్యర్థిగా బరోడా నుంచి ఎన్నికల రేసులో నిల్చున్నారు. గురువారం ఉదయం వెలువడిన ప్రారంభ ఫలితాల్లో ఆయన విజయం వైపు దూసుకెళ్తున్నారు. బబితా ఫొగట్ చర్ఖి దద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె కూడా ప్రత్యర్థికి అందనంత మెజారిటీని సాధించారు. ప్రారంభం నుంచి దాదాపు అన్ని రౌండ్లలోనూ వారు ఆధిక్యాన్ని కనపరుస్తున్నారు.
భారత హాకీ జట్టు మాజీ కేప్టెన్ సందీప్ సింగ్ కురుక్షేత్ర నుంచి పోటీ చేశారు. ఆయన కూడా గెలుపు దిశగా పయనిస్తున్నారు. టిక్ టాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సొనాలి ఫొగట్.. ఆదంపూర్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె కూడా భారీ మెజారిటీని సాధించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల రేసులో నిల్చున్న ఈ నలుగురూ విజయం సాధించేలా కనిపిస్తున్నారు. ఫలితంగా- క్రీడారంగంలోనే కాకుండా రాజకీయ యవనికపైనా వారు రాణిస్తున్నారు. ప్రజలను వారిని ఆదరిస్తున్నారు. ఈ నలుగురికి కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని నమోదు చేసేలా కనిపిస్తున్నారు.