ఎంపీ సీటు ఇస్తామన్నా నో.. ఎందుకంటే? మోడీకి 'గుజరాత్' రాజ్యసభ షాక్, వారిపై ఆధారపడాల్సిందే
న్యూఢిల్లీ/లక్నో: యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మనోహర్ పారికర్ రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఆయనే సీఎంగా కావాలని కోరడంతో రాజ్యసభకు ఆ తర్వాత రాజీనామా చేశారు. గోవా సీఎం అయ్యారు.
ఆయన యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ స్థానం నుంచి ఎవరు ఎన్నికైనా 2020 నవంబర్ వరకు ఎంపీగా ఉంటారు. దీంతో అక్కడ సీటుపై బీజేపీలో ముఖ్య నేతలు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆరేళ్లు
పారికర్ సీటు కాకుండా.. వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ తరఫున 8 మంది ఎంపికయ్యే అవకాశముంది. మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేల బలాన్ని తీసుకుంటే 8 స్థానాలను అవలీలగా గెలుచుకోవచ్చు. ఎస్పీ 1 స్థానాన్ని, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, సమాజ్వాదీలో మిగిలిన ఓట్లు పరిగణలోకి తీసుకుంటే విపక్షాలు మరో స్థానాన్ని కైవశం చేసుకునే అవకాశముంది.
అందుకే ఎవరూ ఆసక్తి చూపించడంలేదు
ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్నికయితే పూర్తి పదవీకాలం అంటే ఆరేళ్ల పాటు కొనసాగవచ్చు. దీంతో బీజేపీ సభ్యులు మనోహర్ పారికర్ ఖాళీ చేసిన స్థానంలో పోటీకి అంతగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఈ వార్తలను బీజేపీ ఖండించింది. ఎవర్ని నిలబెట్టాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెబుతున్నారు. కేంద్రమంత్రి అల్ఫోన్సాను పోటీ చేయించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఏడాది 61 మంది సభ్యుల పదవీ విరమణ
రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ ఆధిక్యం లభించే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ల్లో విజయం సాధించినప్పటికీ ఆ ప్రభావం రాజ్యసభ ఎన్నికలపై ఉండదు. 2018 ఏప్రిల్లో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే జనవరి నుంచి ఏప్రిల్లోగా మొత్తం 61 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో గుజరాత్కు చెందిన వారు నలుగురు. వారిలో అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు.
బీజేపీకి గుజరాత్ రాజ్యసభ దెబ్బ
గుజరాత్ నుంచి ఇద్దరే ఎన్నికయ్యే అవకాశముంది. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల బలం పెరగడంతో ఆ పార్టీ తరఫున ఇద్దరు గెలిచే సూచనలున్నాయి. ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ లెక్కన కాంగ్రెస్ రెండు గెలవనుంది. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి చెందిన ఒక ఎంపీ పదవీ విమరణ చేయనుండగా, తిరిగి ఆ స్థానం భర్తీ కానుంది. ప్రస్తుతానికి అదనంగా కలిసొచ్చిందేమీ లేదు. ఢిల్లీలో కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు ఉండడంతో అక్కడా గెలిచే పరిస్థితి లేదు.
ఇతరపార్టీలపై ఆధారపడాల్సిందే
యూపీలో పది స్థానాలకు ఎన్నిక జరగనుండగా, కనీసం ఎనిమిది దక్కే అవకాశముంది. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ఇద్దరు పదవీ విరమణ చేయనుండగా, అదనంగా ఆరు స్థానాలు కలవనున్నాయి. మహారాష్ట్రలో ఆరు, మధ్యప్రదేశ్లో ఐదు, రాజస్థాన్లో మూడు స్థానాలు సహా ఇతర రాష్ట్రాల్లో 45 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో ఎన్డీఏకు కనీసం పది లభించే అవకాశముంది. రాజ్యసభలో మెజార్టీకి 123 స్థానాలు అవసరం కాగా, ఎన్డీయేకు 97 మాత్రమే లభించే సూచనలు ఉన్నాయి. దాంతో చిన్న పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంటుంది.