బీజేపీ, శివసేన మధ్య కుదరనున్న పొత్తు ..? ప్రకటనే తరువాయి .. సీఎం అభ్యర్థిత్వంపైనే పీఠముడి
న్యూఢిల్లీ : ఒకేగూటి పక్షులు బీజేపీ, శివసేన మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 22 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీచేసినా .. ఈ రెండు పార్టీలు .. 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసాక మాత్రం విడివిడిగా పోటీచేశాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసాక .. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్ లో బీజేపీ గెలుపొంది అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, శివసేన అధినేతలు తాము కలిసి పోటీ చేసే అంశంపై చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అసెంబ్లీ, లోక్ సభకు కలిసే పోటీ ..?
వచ్చే పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని బీజేపీ, శివసేన అధినేతలు భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ అమిత్ షా, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో ఆదివారం ఫోన్ లో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరి చర్చల్లో కొన్ని అంశాలపై మాత్రం స్తబ్ధత నెలకొందని .. వాటిపై కూడా చర్చించి సోమవారం పొత్తుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
జైపూర్ నుంచి ముంబైకి షా ..
షెడ్యూల్ ప్రకారం అమిత్ షా సోమవారం జైపూర్ వెళతారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని .. అటు నుంచి నేరుగా ముంబై వెళతారు. ముంబైలోని ఉద్దవ్ థాక్రే నివాసానికి చేరుకొని కలిసి పోటీ చేసే అంశం .. వివిధ అంశాలపై చర్చిస్తారు. తర్వాత వీరిద్దరూ నేతలు పొత్తుపై ఉమ్మడిగా ప్రకటన చేసే ఛాన్స్ ఉందని ఇరు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తెరపైకి 50 ఫిఫ్టీ ఫార్ములా ...
ఎన్డీఏలోకి తిరిగి రావాలని శివసేన అమిత్ షా కోరుతున్నారు. ఇందుకు ఉద్దవ్ కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా సీట్లపై ఇరుపార్టీ అధినేతల చర్చల మధ్య తేడా వచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీకి 50 ఫిఫ్టీ పార్ములాను శివసేన తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లలో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ఉద్దవ్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
సీఎం కుర్చిపై ఉగిసిలాట ..
సీట్లతోపాటు సీఎం కుర్చిపై కూడా ఇరుపార్టీల చర్చల ప్రక్రియ ఆలస్యానికి కారణమనే వాదన ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలిస్తే సీఎం పదవీ రొటేషన్ చేయాలని ఉద్దవ్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. లేదంటే ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తే వారికే సీఎం పదవీ అప్పగించాలని ఆయన .. అమిత్ షాను పట్టుబట్టినట్టు సమాచారం. చివరగా సీఎం కుర్చీ శివసేనకే అప్పగించాలని ఉద్దవ్ కోరారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం అంశంపై ఇరుపార్టీల పొత్తుపై స్తబ్ధతకు దారితీసింది.
సేనకు 22 లోక్ సభ స్థానాలు ..
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉండగా .. గత ఎన్నికల్లో శివసేనకు బీజేపీ 22 సీట్లను కేటాయించింది. ఈ సారి కూడా 22 సీట్లనే ఇస్తామని అమిత్ షా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తమ అభ్యర్థులు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విజయం సాధించారనే అంశాన్ని ఉద్దవ్ తో ..అమిత్ షా ప్రస్తావించారని తెలిసింది. మొత్తానికి బీజేపీ, శివసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చలు ఒకడుగు ముందుకు .. రెండగులు వెనక్కి అన్నట్టుగా జరుగుతున్నాయి. సేన డిమాండ్లకు, బీజేపీ ఎలా స్పందిస్తోంది .. సీట్ల కేటాయింపులు ... సీఎం కుర్చీ అనే తదితర అంశాల్లో పీఠముడి నెలకొంది. దీనిని బీజేపీ ఎలా అధిగమించి పొత్తుపై ముందుకెళుతుందో వేచిచూడాలి