బీజేపీకి పంకజా ముండే గుడ్ బై? శివసేన కూటమి సర్కార్ వైపు.. !
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన సారథ్యంలోని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ కూటమి.. ఇక రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని దక్కకుండా చేసిన మహా వికాస్ అఘాడీ కూటమి.. ఇక రాజకీయంగా బలహీనపర్చే దిశగా పావులు కదుపుతోంది. బీజేపీ సీనియర్ నాయకులను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా- బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి, దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండేను కూటమిలో చేర్చుకునే దిశగా ఎత్తులు వేస్తోంది.
Disha murder Case: మాకు న్యాయం దక్కలేదు..మీకు అలా జరక్కూడదు: దిశా కుటుంబంతో నిర్భయ తల్లి..!
గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన పంకజా ముండే.. బీజేపీలో కీలక నాయకురాలిగా ఎదిగారు. ఇదివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపీనాథ్ ముండే.. తన సమీప ప్రత్యర్థి, నేషనలిస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి ధనంజయ ముండే చేతిలో ఓడిపోయారు. పంకజా ముండేకు సమీప బంధువే ధనంజయ ముండే.
తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం- ఆమె బీజేపీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అనుమానాలను మరింత బలపరిచేలా ఆమె వ్యవహరించారు. సోమవారం ఉదయం ఆమె తన ట్విట్టర్ లో నుంచి బీజేపీ ఐడెంటిటీని తొలగించేశారు. రాజకీయంగా తన సరి కొత్త బాటను ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటూ కొద్దిరోజుల కిందటే పంకజా ముండే తన ఫేస్ బుక్ అకౌంట్ లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు.
అప్పట్లోనే ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా- ట్విట్టర్ నుంచి బీజేపీ ఐడెంటిటీని తొలగించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. శివసేన లేదా తనకు సమీప బంధువర్గం ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్: పార్టీ తీర్థాన్ని పుచ్చుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని మహారాష్ట్ర మీడియా అంచనా వేస్తోంది. శివసేనలో చేరడానికే అవకాశాలు ఉన్నాయనే వాదనలు కూడా లేకపోలేదు. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్, ఎన్సీపీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సులేలతో పంకజా ముండే మంతనాలు కొనసాగిస్తున్నారని మహారాష్ట్ర మీడియా వెల్లడించింది.