బీజేపీ ఎమ్మెల్యేకు దక్కిన ప్రొటెం స్పీకర్ ఛాన్స్..!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు కాళిదాస్ నీలకంఠ కోలంబ్కర్.. ప్రొటెం స్పీకర్ గా నియమితులయ్యారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీకి ఎన్నికైన 288 మంది సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండు రోజుల పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
శరద్ పవార్ చాణక్యం: తలొంచిన అజిత్.. రేపో మాపో సొంత గూటికి..!
సభా సంప్రదాయాల ప్రకారం.. అత్యంత సీనియర్ సభ్యుడికి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం లభిస్తుంది. ప్రొటెం స్పీకర్ రేసులో మొత్తం ఆరుమంది సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. కాళిదాస్ కోలంబ్కర్ తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున జయంత్ పాటిల్, దిలీప్ వల్సే పాటిల్, బీజేపీ నుంచే బబన్ రావు పచ్పుతే, కాంగ్రెస్ కు చెందిన కేసీ పాడ్వీ, బాలా సాహెబ్ థొరట్ లల్లో ఒకరికి ఈ పదవి దక్కవచ్చని మంగళవారం ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి.
ప్రస్తుత శాసనసభకు ఎన్నికైన వారందరిలో ఈ ఆరుమందే అత్యంత సీనియర్లు కావడం వల్ల వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం అసెంబ్లీలో బల పరీక్షను నిర్వహించాల్సి ఉన్నందున.. ప్రొటెం స్పీకర్ ఎవరనే విషయాన్ని మంగళవారమే ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ శాసన సభ్యుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్న తరువాత.. కాళిదాస్ కోలంబ్కర్ పేరును ఖరారు చేశారు.
ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ తో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు కాళిదాస్. అనంతరం బీజేపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వడాలా స్థానం నుంచి విజయం సాధించారు.