చివరి నిమిషంలో ఆలోచన విరమించిన బీజేపీ..ఆగమేఘాలపై యెడ్డీ ప్రమాణం ఇందుకేనా..?
గత మూడు రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత యడియూరప్ప కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే బీజేపీ అధిష్టానం మదిలో మాత్రం మరో ఆలోచన ఉన్నింది. ఇంతకీ ఏంటా ఆలోచన..? అది పక్కనబెట్టి ఆగమేఘాలపై యడియూరప్పతో సీఎంగా ఎందుకు ప్రమాణస్వీకారం చేయించింది..?
ఆగమేఘాలపై యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం
కర్నాటకలో గత కొద్ది రోజులుగా హైడ్రామానే నడిచింది. 16 మంది రెబెల్ ఎమ్మేల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం వారు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం, క్యాంపు రాజకీయాలకు తెరలేవడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. సభలో కుమారస్వామి బలం నిరూపించుకోలేక పోవడంతో సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప మాత్రం వెంటనే గవర్నర్ను కలవడం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి. అయితే అంతకంటే ముందు కర్నాటకలో రాజకీయాలను నిశితంగా పరిశీలించిన బీజేపీ అధిష్టానం ముందుగా రాష్ట్రపతి పాలన విధించాలని భావించింది. కానీ ఆ తర్వాత కొన్ని లెక్కలు తెరమీదకు రావడంతో ఆ ఆలోచన విరమించుకుని యడియూరప్పను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆదేశించింది.
రామలింగారెడ్డి సీఎం అభ్యర్థిగా పావులు కదిపిన కాంగ్రెస్
కుమారస్వామి సర్కార్ కూలిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రామలింగా రెడ్డిని సీఎం అభ్యర్థిగా నిలిపి తిరిగి జేడీఎస్తో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పావులు కదిపింది. ఈ విషయం తెలియగానే అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించేందుకు సిద్ధమైన బీజేపీ గురువారం రాత్రి ఒక్కసారిగా వ్యూహాలను మార్చి వెంటనే యడియూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించింది. అంతేకాదు స్పీకర్ కేఆర్ రమేష్ కూడా ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో దీనికి మరింత బలంను చేకూర్చింది. దీంతో 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుంది. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రే పావులు కదుపుతున్నట్లు బీజేపీకి సమాచారం అందింది.
నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేసినా మరోలా స్టోరీ
ఒక వేళ 13 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో 4 లేదా 5 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించి తమకు మద్దతు ఇచ్చేలా కన్విన్స్ చేయగలిగి ఉంటే తిరిగి కాంగ్రెస్ -జేడీఎస్ సర్కార్ కర్నాటకలో ఏర్పాటై ఉండేది. దీంతో బీజేపీ ఆశలు ఆవిరయ్యేవి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురు లేదా ఐదుమందిని బుజ్జగించి తమకు మద్దతు తెలిపేలా చేసుకొని ఉంటే రామలింగా రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావించింది. రెబెల్ ఎమ్మెల్యేలతో రామలింగారెడ్డికి మంచి సంబంధాలున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగి ఉంటే బీజేపీ నుంచి ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలను రివర్స్ ఆపరేషన్ పద్ధతి ద్వారా కాంగ్రెస్ తమవైపు తిప్పుకునేలా వ్యూహాలు రచించింది.
కాంగ్రెస్ వ్యూహం తెలిసి తన వ్యూహాన్ని మార్చేసిన బీజేపీ
మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న బీజేపీ అధిష్టానం అన్ని విషయాలను పక్కనబెట్టి ముందుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందకు యడియూరప్పను సిద్ధం కావాల్సిందిగా ఢిల్లీ నుంచి ఆదేశాలు పంపింది. అంతేకాదు ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటువేయడంతో మిగతా రెబెల్ ఎమ్మెల్యేల్లో కాస్త ఆందోళన కలిగింది. ఎక్కడ వీరు వచ్చి కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తారో అన్న కంగారు కమలం పార్టీలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆగమేఘాలపై పావులు కదిపిన కమలనాథులు ముందుగా యడియూరప్పను సీఎంగా చేసి ఆ తర్వాత మంత్రులతో కూడిన కేబినెట్ను నెమ్మదిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే కొత్త స్పీకర్ను ఏర్పాటు చేసి రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింపచేయాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. వారిపై అనర్హత వేటు పడకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం.