మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : సీట్ల పంపకాలపై శివసేనతో బీజేపీ చర్చలు, సర్వేపై కాంగ్రెస్ చిందులు
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో .. రాజకీయ పార్టీలు తమ వ్యుహాల్లో మునిగితేలాయి. పొత్తులు, ఎత్తులపై అధికార బీజేపీ దృష్టిసారించింది. ఈ మేరకు శివసేనతో బీజేపీ నేతలు బుధవారం చర్చలు జరిపారు. సీట్ల అంశంపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఏయే స్థానాలపై పోటీ అంశంపై తొలి దశ చర్చల్లో క్లారిటీ రాలేదు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ నివాసంలో ఆర్థికమంత్రి, బీజేపీ నేత సుదీర్ ముంగటివర్, శివసేన నేత సుభాష్ దేశాయ్ చర్చలు జరిపారు. అయితే ఇటీవల కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి కొందరు నేతలు బీజేపీలో చేరారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటు ఇస్తామని బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టంచేశారు. బీజేపీ భాగస్వామ్య కూటమిలో శివసేనతోపాటు రాష్ట్రీయ సమాజ్ పక్ష్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ 1 ఉన్నాయి.
పొత్తులపై బీజేపీ సమాలోచనలు చేస్తుంటే .. ఇటీవల బీజేపీ విడుదల చేసిన సర్వేపై కాంగ్రెస్ తప్పుపట్టింది. మహారాష్ట్రలో 288 సీట్లలో అధికార బీజేపీ 229 సీట్లు గెలుస్తుందని సర్వే వివరాలను బీజేపీ విడుదల చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎం ద్వారా కాకుండా .. బ్యాలెట్ పద్ధితిలో నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బీజేపీ విజయం నల్లేరు మీద నడక అయినప్పుడు మరి శివసేన, బీజేపీ ఎందుకు రథయాత్రలు చేపడుతున్నాయని కాంగ్రెస్ నేత వడ్డెటివార్ ప్రశ్నించారు. ఆ పార్టీది మేకపోతు గాంభీర్యమని దుయ్యపట్టారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వ్యతిరేతను కప్పిపుచ్చుకునేందకే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.