ఎంతో ఆవేదన చెందా, బీజేపీ-శివసేన మైత్రీపై: అద్వానీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ, శివసేన మధ్య మిత్రత్వం కొనసాగితేనే మంచిదని బారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ మహారాష్ట్రలో ఫలితాను చూసి తాను సంతృప్తి చెందానని, మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
రెండున్నర దశాబ్దాల స్నేహం విచ్ఛిన్నమైనప్పుడు తానెంతో ఆవేదన చెందానని, ఇప్పుడు మళ్లీ ఇరు పార్టీలు కలిసే అవకాశం వచ్చిందని అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. మైత్రీబంధం తెగిపోకుండా ఉండాల్సిందని తాను మొదటి నుంచి చెబుతున్నాని, తమ పార్టీ నేతలు, శివసేన నేతలు తన ప్రమేయం కోరితే తప్పకుండా సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు.
మహారాష్ట్ర లాంటి ప్రాధాన్యం ఉన్న రాష్ట్రంలో పాత మిత్రత్వాన్ని పునరుద్ధరించాలని అద్వానీ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటు కుదరక పోవడంతో 25 సంవత్సరాలుగా ఉన్న మైత్రి బంధాన్ని రెండు పార్టీలు తెంచుకోని విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.
భాజపాకు బయటి నుంచి మద్దతిస్తాం: ఎన్సీపీ
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి బయటి నుంచి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ సుముఖత వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్ తెలిపారు. మహారాష్ట్రలో సుస్దిర ప్రభుత్వం ఏర్పాడాలన్నదే తమ ఉద్దేశమని.. రాష్టం అభివృద్దిలో పయనించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.
అభివృద్ది కోసం కృషి చేసే పార్టీకే తమ మద్దతు: ఉద్దవ్ థాకరే
మహారాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేసే పార్టీకే తమ మద్దతు ఉంటుందని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. తమకు రాజకీయాలకన్నా రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోడీ హవా లేదని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
శివసేనతో పొత్తు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది : నిర్మలా సీతారామన్
అవినీతి కాంగ్రెస్ను తరిమికొట్టాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీకి మెజార్టీ సీట్లను కట్టబెట్టారని నిర్మాలా సీతారామన్ అన్నారు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు కుదర్చుకునే విషయాన్ని సాయంత్రం సమావేశమయ్యే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.