దేశం కొత్త ప్రధాని కోసం ఎదురు చూస్తోంది: అఖిలేష్ యాదవ్
దేశం కొత్త ప్రధాని కోసం ఎదురు చూస్తోందన్నారు సమాజ్ వాదీ ఛీఫ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. మోడీ కాకుండా మరొకరు ఎవరైనా కొత్త వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీకి సూచించారు అఖిలేష్ యాదవ్. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒకతాటిపైకి వచ్చాయని అయితే ఈ కూటమిలో కూడా చాలామంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. అయితే ప్రధాని అభ్యర్థి ఎవరుంటారనేదానిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. నాయకత్వంపై ప్రజలే ప్రశ్నిస్తారని తిరిగి ఆ ప్రజలే నాయకుడిని నిర్ణయిస్తారని చరిత్ర చెబుతోందన్నారు.
ప్రధాని మంత్రి అభ్యర్థులు చాలామంది ఉన్నారని ప్రజలకు కూడా తెలుసని చెప్పిన అఖిలేష్ యాదవ్... ప్రధాని మార్పును మాత్రం ప్రజలు కచ్చితంగా కోరుకుంటున్నారనేది నిజం అన్నారు. మోడీ కాకుండా మరో వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా ఉంటే బీజేపీ చెప్పాలని సవాలు విసిరారు. విపక్షాలు జతకట్టాయని బీజేపీ విమర్శించేముందు తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని అఖిలేష్ అన్నారు.
ఇక మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ పై మండిపడ్డారు అఖిలేష్. బీఎస్పీ ఎస్పీ పొత్తును జీర్ణించుకోలేని వారు విసిగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా వారు చేసిందేమీ లేదని అందుకే వారు చేసిన మంచి పనులు గురించి ప్రస్తావించలేరు కాబట్టే ప్రత్యక్ష మాటలయుద్ధానికి దిగుతున్నారని అఖిలేష్ చెప్పారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మరింత పరుషపదజాలం వాడుతారని జోస్యం చెప్పారు అఖిలేష్. సాధువులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తామన్న పెన్షన్పై కూడా అఖిలేష్ స్పందించారు. నెలకు రూ.20వేలు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో రామ్లీలా నాటకాలు ప్రదర్శిస్తుంటారని అందులోని రాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేసే వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. ఇంకా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు మిగిలి ఉంటే రావణుడికి కూడా పెన్షన్ ఇవ్వాలని సూచించారు.