విదేశాల్లో మోడీపై విద్వేషవ్యాఖ్యలా-భారత్ పరువు పోతోంది-రాహుల్ పై బీజేపీ ఫైర్
జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్న నేతల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎప్పుడూ ముందుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చి ఆ తర్వాత మళ్లీ పట్టువీడిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ప్రధాని మోడీపై నిత్యం చేస్తున్న విమర్శలు బీజేపీకి సైతం మంటపుట్టిస్తున్నాయి. పలు సందర్భాల్లో రాహుల్ చేస్తున్న విమర్శలకు బీజేపీ దగ్గర సమాధానం కూడా ఉండడం లేదు.
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై బీజేపీ ఇవాళ స్పందించింది. ప్రధాని మోడీపై చేస్తున్న రాహుల్ గాంధీ చేస్తున్న విద్వేష వ్యాఖ్యలతో దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ముఖ్యంగా పిదేశాల్లో రాహుల్ గాంధీ మోడీపై చేస్తున్న వ్యాఖ్యలతో దేశం పరువు మంటగలుస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. రాహుల్ గాంధీ లండన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన భాటియా.. రాహుల్ దేశమంతా కిరోసిన్ జల్లుతున్నారని, మంట అంటుకోవడానికి ఎంతో సేపు పట్టదన్నారు.
బీజేపీ గురించి, ప్రధాని మోడీ గురించి విదేశాల్లో రాహుల్ చేస్తున్నవ్యాఖ్యల ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంటుందని గౌరవ్ భాటియా తెలిపారు. 1984 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశమంతా మంటలు అంటించేందుకు ప్రయత్నిస్తూ ఉందని ఆయన ఆరోపించారు.
సిక్కుల ఊచకోత నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకూ చోటు చేసుకుంటున్న పలు ఘటనల్ని ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఓ పార్ట్ టైమ్,పరిణతి లేని నాయకుడిగా ఆయన అభివర్ణించారు. లండన్ లో తాజాగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ను ఇరుకునపెట్టాయి.