శత్రుఘ్న సిన్హాకు షాకిచ్చిన బీజేపీ: తెరపైకి సుశీల్ మోడీ
పాట్నా: ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగుతూనే మరో వైపు ఆ సొంత పార్టీపైనే తరచూ విమర్శలు ఎక్కుపెట్టే శత్రుఘ్న సిన్హాకు ఆ పార్టీ గట్టి షాకిచ్చింది. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీని బీజేపీ బరిలో దించనుంది.
పార్టీ కీలక నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 2014 లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్ర కేబినెట్లోకి తనను తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్న సిన్హా కొంత కాలంగా ప్రధాని మోడీ, పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో గళం విప్పారు.
2019 లోక్సభ ఎన్నికల్లో తాను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న శత్రుఘ్న సిన్హాకు సుశీల్ కుమార్ మోడీ తెరపైకి తేవడం ద్వారా చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే, చివరి సమయం వరకు వేచి చూడాల్సిందే.