దక్షిణాది రాష్ట్రాల్లో బీజెపి..! ఏపిలో మళ్లీ కాంగ్రెస్..!! టార్గెట్ అదికారం..
విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు పార్టీకి తిరిగి ఊపిరిపోసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ఇక కాంగ్రెస్ పని అయిపోయందన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఆయుధంగా తీసుకుని కాంగ్రెస్ బలపడేందుకు కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా ఇటీవలే ఆపరేషన్ స్వగృహను ప్రారంభించిన నేతలు ఆయా జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ కి మళ్లీ జవసత్వాలు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇదిలా ఉంటే దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు చూపిస్తున్న భిన్నత్వం పై బీజేపి కన్నేసింది. ఓ సారి ప్రాంతీయ పార్టీకి మరో సారి జాతీయ పార్టీకి పట్టం కట్టే దక్షిణభారత రాష్ట్రాల్లో ప్రభావం చూపాలని బీజేపి ప్రణాళిక రచిస్తోంది. అయితే సుధీర్ఘ రాజకీయ చరిత్రలో బీజేపీ మాత్రం ఎప్పుడు తన ఆధిపత్యాన్ని దక్షిణాన ప్రదర్శించలేకపోయింది. కాని ఇప్పుడు మోదీ ఎలాగైన దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో స్పష్టమైన మెజారిటీ సాధించాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నారు. ఈ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.!
దక్షిణాన నిలబడాలి..! ఇదే మోదీ శపథం..!!
భారతీయ జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి పట్టు సాధించింది. కేవలం మోదీ మీద అభిమానంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అయితే స్థానిక రాజకీయాలకు అనుగుణంగా తన స్ట్రాటజీని మార్చుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్నప్పటికి రెండు పార్టీల మధ్య కొంత అగాదం ఏర్పడింది. ఇదే తరుణంగా బీజేపీ వైసీపీ నేత జగన్తో కూడా టచ్లో ఉంది. పలుమార్లు జగన్ ఢిల్లి వెళ్లి మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రావడంతో పొత్తుపై అనేక చర్చలు జరిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్తో బయటి నుంచి సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే అధికార పార్టీలతో కలిసి పనిచేస్తున్న బీజేపీ ప్రత్యామ్నయ దారులను కూడా వెతుకుతుంది.
ప్రత్యామ్నాయ పార్టీ నాయకులకు ఎర..! అదికార పార్టీలకు అవకాశం ఇవ్వొద్దంటున్న బీజేపి..!!
ఇందులో భాగంగా సినీ నటుడు పవన్కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రం సూచన మేరకు పవన్ తెలంగాణ, ఏపీలో రాష్ట్రాలో తిరిగేందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయిన అది కాంగ్రెస్ లాభం చేకూరకుండా ఉండేందుకు బీజేపీ ఈ తరహా వ్యుహం అమలు చేస్తున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. తమిళనాడులో కూడా బీజేపీ మద్దతుతోనే రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నాడు. తెలంగాణ ఏపీ విషయం బయటపెడితే బీజేపీ వ్యూహానికి కమల్హాసన్, ప్రకాశ్రాజ్ అడ్డుగా మారతారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఏపీ లో పూర్వవైభవాపనికి కాంగ్రెస్ కసరత్తు..!
తాజాగా ఏపీలో పూర్వవైభవం కోసం వాడవాడలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు ఏపి కాంగ్రెస్ నాయకులు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీధికూడలి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు, అలాగే అభిమానుల ఇళ్ల వద్ద పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రచారం చేయడానికి సూచికగా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పనిలో పనిగా రాష్ట్ర విభజన పాపం తమ ఒక్కరిదే కాదని బీజెపి సహకారం లేకపోతే విభజన జరిగేది కాదని చెప్పడంతో పాటు అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే విభజన జరిగిందని కూడా ప్రజలకు వివరించనున్నారు. అయితే విభజనలో జరిగిన అన్యాయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూరించగలదని ఆ బోర్డుల్లో రాయనున్నారు. అలాగే కరపత్రాల పంపిణీ, వీలైన చోట్ల కార్యకర్తల ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఈ మేరకు వీలైనంత త్వరలో అన్ని చోట్లా పార్టీ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా అంశమే ఆయుధం..! వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్..!!
ఇదిలావుండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాల వేట మొదలైంది. మూడు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తమకు అనుకూలురైన నాయకులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది అలాగే నేతలు ఎవరికి వారుగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై ప్రయత్నాలు ప్రారంభించారనే వార్తలు వినిపిస్తున్నాయి.