గూగుల్ ఫేస్బుక్లు విప్పిన చిట్టా: వామ్మో..! బీజేపీ పొలిటికల్ యాడ్స్ ఖర్చు ఇంతనా..?
ఎన్నికల వేళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. నిబంధనలకు మించి ఆయా పార్టీల తమ ప్రచారాల కోసం ఖర్చు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏయే పార్టీలు అత్యధికంగా ఖర్చు చేశాయి... ఖర్చుల విషయంలో టాప్లో ఉన్న పార్టీ ఏంటి..?
పొలిటికల్ యాడ్స్ పై భారీగా ఖర్చు
ఎన్నికల ప్రచారంలో పార్టీలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. వివిధ రకాలుగా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తమ పార్టీలను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇక ప్రసాద మాధ్యమాలు పక్కన పెడితే ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చాలు దేశ నలుమూలలకు చేరిపోతున్నాయి వార్తలు. దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని తమ ప్రచారంను కొనసాగిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా సోషల్ మీడియాలో లేదా డిజిటల్ ప్లాట్ఫాంపై తమ ప్రచారాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయి పార్టీలు . ఇందులో తమ క్యాంపెయినింగ్కు అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం భారతీయ జనతా పార్టీగా తెలుస్తోంది.
లెక్కల చిట్టా విప్పిన గూగుల్ ఫేస్ బుక్
ఎన్నికల చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో కమలం పార్టీ పెద్ద ఎత్తున్న పొలిటికల్ యాడ్స్ను గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై ప్రమోట్ చేస్తోంది. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తోంది. బీజేపీ పార్టీ అధికార ఖాతా నుంచి మొత్తం 20 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. గూగుల్, యూట్యూబ్లో పొలిటికల్ యాడ్స్ కోసం అన్ని పార్టీల నుంచి మొత్తం రూ.27 కోట్లు వసూలు కాగా అందులో ఒక్క బీజేపీనే రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ ఖర్చు చేస్తున్న దానికన్నా 500శాతం ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ రూ.2.7 కోట్లను ఖర్చు చేసింది. గూగుల్ ఫేస్బుక్ కంపెనీలు పార్టీల నుంచి ఎంత మొత్తం తమకు అందుతుందో అనే విషయంలో పారదర్శకత ఉండాలని భావించి ఆ మొత్తం వివరాలను బహిరంగం చేసింది.
అధికారిక అకౌంట్తో పాటు ఇతర పేజీలు కూడా
ఫిబ్రవరి నుంచి మే 11 వరకు ఫేస్బుక్లో పొలిటికల్ యాడ్స్ కోసం బీజేపీ రూ.4 కోట్లు ఖర్చు చేసింది. ఇది కాంగ్రెస్కంటే 200శాతం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ రూ.1.3 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఎన్నికలు చివరి దశలో ఉన్నందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మే 19న ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్న వారణాసిలో పోలింగ్ ఉన్నందున బీజేపీ సోషల్ మీడియాపై మరిన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఈ ఖర్చు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే కాకుండా ఆపార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న పేజీలపై కూడా ఖర్చు చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక 'భారత్ కే మన్ కీ బాత్' 'మై ఫస్ట్ వోట్ ఫర్ మోడీ' 'నేషన్ విత్ నమో' అనే ఫేస్బుక్ ఖాతాలు అత్యధికంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ తర్వాతి స్థానం డీఎంకేదే..!
ఇక వాట్సాప్ లాంటి ఇతర ప్లాట్ఫాంలపై కూడా బీజేపీ జోరుగా పొలిటికల్ యాడ్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నరేంద్ర మోడీకి మంచి సోషల్ మీడియా ప్లాట్ఫాం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో బీజేపీ మరింత ఖర్చు చేసే అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు. పొలిటికల్ యాడ్లు తమ వెబ్సైట్లపై రావాలంటే ముందుగా ఈసీ అనుమతి పొందాలని తమ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు గూగుల్ సంస్థ తెలిపింది. అనుమతి పొందాకే యాడ్స్ను ఇవ్వాలని సూచించినట్లు స్పష్టం చేసింది. ఇక బీజేపీ తర్వాత అత్యధికంగా సోషల్ మీడియాలో ఖర్చు చేస్తున్న పార్టీల్లో డీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ఈ పార్టీ రూ. 4 కోట్లు ఖర్చు చేస్తోంది.
మొత్తనికి 2014లోనే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో రాజకీయ ప్రపంచానికి అర్థమైంది. ఇక అప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగానే చాలా వరకు ప్రచారాలు హంగులు ఆర్భాటాలు ఆయా పార్టీలు నిర్వహిస్తున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.