హిందుస్తాన్ లో తాలిబన్ కార్యక్రమాలు, వాళ్లు ఎవరు చెప్పడానికి: శశి థరూర్ ఫైర్, వివాదం!
తిరువనంతపురం: బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం కలిసి భారతదేశంలో హిందుస్తాన్ (హిందూయిజం)లో తాలిబన్ కార్యక్రమాలు ప్రారంభిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ మరోసారి వివావాదస్పద వ్యాఖ్యలు చేశారు.
2019లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్ గా మార్చుతుందని ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని బీజేపీ నాయకులు అంటున్నారని శశి థరూర్ మండిపడ్డారు.
తాను భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్ కు వెళ్లాలని చెప్పడానికి బీజేపీ నాయకులకు ఏం అధికారం ఉందని, అలా చెప్పడానికి వారు ఎవరని శశి థరూర్ ప్రశ్నించారు. తాను హిందూ కాదని చెప్పడానికి బీజేపీకి ఎవరు అధికారం ఇచ్చారని, వారి లాంటి హిందువు తాను కాదని శశి థరూర్ అన్నారు.
నేను నా దేశాన్ని వదిలి ఎందుకు వెళ్లాలని శశి థరూర్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఇటీవల కేరలలోని తన కార్యాలయం మీద బీజేపీ యువమోర్చ కార్యకర్తలు దాడి చేశారని, ఇలాంటి దాడులకు తాను భయపడనని శశి థరూర్ అన్నారు. దేశంలో బీజేపీ నాయకులు హిందుస్తాన్ (హిందూయిజం) తాలిబన్ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్దం అయ్యిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్ మీద పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.