ఆపరేషన్ లోటస్: కాంగ్రెస్-శివసేనల్లో ఫిరాయింపులు..! సుప్రీం కేసుతో ముందస్తుగానే..!
మహారాష్ట్ర రాజకీయాల్లో క్షణ క్షణానికి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమిగా ఉన్న మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయినా..లోలోపల మాత్రం చివరి నిమిషం వరకు ఎవరు తమతో ఉంటారు..ఎవరైనా బీజేపీ తో టచ్ లో ఉంటారా అనే అనుమానం. ఇదే సమయంలో..బీజేపీ ఆపరేషన్ లోటస్ మొదలు పెట్టింది. తెర వెనుక రాజకీయాలను ముమ్మరం చేసింది.
అందులో భాగంగా... తమ మైండ్ గేమ్ తీవ్ర తరం చేసింది. కాంగ్రెస్..శివసేన నుండి భారీగా చీలికలు ఉండబోతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక..సుప్రీం కోర్టులో సోమవారం బల పరీక్ష నిర్వహణ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో..నెంబర్ గేమ్ మరింత వేగం కానుంది. ఎవరికి వారు తమ నెంబర్ పెంచుకొనే పనిలో ఉన్నారు. ఫిరాయింపుల దార్లు ఎవరనే చర్చ మొదలైంది.
బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం..
అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం మీద ఫడ్నవీస్ ను కూర్చోబెట్టిన బీజేపీ...ఇప్పుడు బల పరీక్షలో సైతం నిలబడి తమ సత్తా చాటుకొనేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. సుప్రీం కోర్టు బలపరీక్ష నిర్వహణ పైన ఏదైనా ఉత్తర్వులు ఇస్తే..నిరూపించుకొనేందుకు ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆపరేషన్ లోటస్ ను వేగవంతంగా అమలు చేస్తోంది.
ఎన్సీపీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్ తమ వైపు తిప్పుకోవటం ద్వారా షాక్ ఇచ్చిన బీజేపీ..ఇప్పుడు కాంగ్రెస్.. శివసేన ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, సుప్రీం కోర్టులో వచ్చే మార్గదర్శకాల తరువాత బీజేపీ గేమ్ ప్లాన్ అమలు చేయనుంది.
శివసేన ఎమ్మెల్యేల చీలక ఉందంటూ..
మహారాష్ట్రలో ఇప్పుడు ప్రతీ ఎమ్మెల్యే కీలకంగా మారారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో శివసేనకు సీఎం పదవి దక్కకుండా అడ్డుకొనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. శివసేనకున్న 56 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 24 మంది ఎన్సీపీ, కాంగ్రె్సతో కలిసి ముందుకు సాగేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.
శివసేనకు చెందిన ఒక బలమైన నేత ఆ 24 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్నట్టు సమాచారం. అయితే, శివసేన మిగిలిన రెండు పార్టీలతో కూటమిగా ఏర్పడకముందే ఈ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్ల ప్రచారం సాగుతోంది. బీజేపీ సైతం వారు తమతోనే వస్తారనే ధీమాతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ నుండి 30 మందికి పైగా..
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకున్న 45 మంది ఎమ్మెల్యేల్లో 30 నుంచి 35 మంది అదే బాటలో నడుస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. శివసేనకు.. హిందుత్వకు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ ఎలాగూ సిద్ధమయిందని... అలాంటప్పుడు బీజేపీకి మాత్రం ఎందుకు ఇవ్వకూడదని.. కాంగ్రెస్ నేతలు కొందరు అంతర్గత చర్చల్లొ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలోమహారాష్ట్ర దివాలా తీసిన రాష్ట్రం. కేంద్రంలో బీజేపీ ఉంది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేంద్రం మహారాష్ట్రకు సాయం చేస్తుందనుకుంటున్నారా.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చూడండి అంటూ మరరో సీరియస్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే..కాంగ్రెస్ నేతలు అందరూ ఒకే మాట మీద లేరనే విషయం స్పష్టం అవుతోంది.
సుప్రీం తీర్పు వైపే అందరి చూపు
సుప్రీం కోర్టు అదివారం కూటమితో పాటుగా బీజేపీ తరపు వాదనలు విన్నది. గవర్నర్ నుండి వచ్చిన లేఖ తో పాటుగా..గవర్నర్ కు ఇచ్చిన లేఖలను సమర్పించాలని కేంద్రం..ఫడ్నవీస్..అజిత్ పవార్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వీటిని కోర్టుకు సమర్పించిన తరువాత వాదనలు సాగనున్నాయ. ఆ తరువాత సుప్రీం బెంచ్ ఈ మొత్తం వ్యవహారం పైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయం కావటంతో..ఇక జాతీయ స్థాయిలో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.