'బీజేపీ అలా చేయడం అక్రమం.. ఎన్నికల ఫలితాలను దొంగిలిస్తోంది'
అక్రమంగా గోవా, మణిపూర్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలోకి వేసుకుంటుందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోను చక్రం తిప్పింది. మిత్రపక్షాల మద్దతుతో ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేయడంలో బీజేపీ సఫలమైంది.
ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బీజేపీపై పలు విమర్శలు చేశారు. అక్రమంగా గోవా, మణిపూర్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలోకి వేసుకుంటుందని ఆయన ఆరోపించారు.
గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తొలిస్థానంలో, బీజేపీ రెండో స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదన్నారు. ఫలితాలను దొంగిలించే తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించడంతో చిదంబరం ఇలా స్పందించారు. గోవా గవర్నర్ మృదులా సిన్హాను కలిసిన బీజేపీ సీఎం అభ్యర్థి మనోహర్ పారికర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
కాగా, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్-17సీట్లతో తొలిస్థానంలో, 13సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచాయి. కానీ స్థానిక పార్టీల నుంచి నేతలు బీజేపీకే మద్దతు పలకడంతో పారికర్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యారు.
ఇక మణిపూర్ లోను ఇదే పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 21సీట్లు, కాంగ్రెస్ 27సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ కే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. బీజేపీ తమకు 31మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు ప్రకటించింది. దీంతొ మణిపూర్ లోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాముంది.