ప్రశాంత్ కిషోర్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్: బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగేదదే అంటున్న బీజేపీ
పశ్చిమ బెంగాల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దాటదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ దుమారం నెలకొంది . మమతా బెనర్జీ కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్త వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
బెంగాల్ ఎన్నికల తరువాత దేశం ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని కౌంటర్
దీనిపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఇన్చార్జి కైలాష్ విజయవర్గియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల తరువాత దేశం ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని ఆయన అన్నారు. అదే సమయంలో జెడియు నాయకుడు అజయ్ అలోక్ కూడా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ను టార్గెట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తూ రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికలలో మళ్లీ టీఎంసీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీ సునామి కొనసాగుతుంది , 200 సీట్లకు మించి స్థానాలను గెలుచుకుంటాం
ఈ క్రమంలో బిజెపికి రెండంకెల కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీడియాకు అనుకూలమైన ఒక విభాగం సృష్టించిన వాతావరణానికి భిన్నంగా, పశ్చిమ బెంగాల్లో బిజెపి రెండు అంకెలను దాటడానికి కష్టపడాల్సి ఉంటుంది" అని ట్వీట్ చేసారు. అందుకు సమాధానంగా కైలాష్ విజయ్ వర్గియా ప్రస్తుతం బీజేపీ సునామి కొనసాగుతుందని, 200 సీట్లకు మించి స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనం బిజెపి వెంట ఉన్నారనేది అమిత్ షా పర్యటనతో సుస్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
ఒక ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తున్నట్టు విజయ్ వర్గీయ సంచలనం
బిజెపి గెలిచి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఒక ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని విజయ్ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ 2014లో నరేంద్ర మోడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాలు తారుమారు అయినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై పీకే ఫోకస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఎన్నికల వ్యూహ కర్తగా వ్యవహరించినప్పటికీ సమాజ్వాది పార్టీని మాత్రం అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు . బీజేపీ విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .