గుజరాత్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్స్వీప్: కాంగ్రెస్ గల్లంతు, పీసీసీ చీఫ్ రాజీనామా
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటింది. గుజరాత్ తమ కంచుకోట అని మరోసారి నిరూపించింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసింది.
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ క్లీన్స్వీప్
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 31 జిల్లా పంచాయతీలు, 81 మున్సిపాలిటీలు, 231 తాలూకా పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 31 జిల్లా పంచాయతీల్లో 980 స్థానలు ఉండగా, వీటిలో 742 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో అన్ని జిల్లా పంచాయతీలు కూడా బీజేపీ ఖాతాలో చేరిపోయాయి. కాంగ్రెస్ 137 చోట్లకే పరిమితమైంది.
కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే..
ఇక 231 తాలూకా పంచాయతీల్లోని 4774 స్థానాలకు గానూ బీజేపీ 2720 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 994 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. మరికొన్ని చోట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు 81 మున్సిపాలిటీల్లో దాదాపు 60 స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 10 స్థానాల్లోనే ఆధిక్యత కనబర్చింది. తొలిసారి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కొంత మేర ప్రభావం చూపింది.
గుజరాత్ ప్రజలకు మోడీ శిరస్సు వంచి అభివాదం
గుజరాత్ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ బీజేపీ క్వీన్ స్వీప్ చేయడం విశేషం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయనాలను నమోదు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ సుపరిపాలనకు ఈ ఫలితాలే నిరద్శనమని ట్వీట్ చేశారు. గుజరాత్ ప్రజలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీపై మరోసారి నమ్మం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన గుజరాత్ ప్రజలకు కేంద్రమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్కు ఘోర పరాభవం.. గుజరాత్ పీసీసీ చీఫ్ రాజీనామా
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్దా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పరేష్ ధనాని కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, తమ ఓటమికి ఈవీఎంలే కారణమని వీరు ఆరోపణలు చేయడం గమనార్హం.