హీరో కమల్ హాసన్ మీద బీజేపీ ఫైర్: అబ్దుల్ కలామ్ ను అడ్డంపెట్టుకుని, దేశం ఆస్తి !
చెన్నై: రాజకీయ రంగప్రవేశం చేస్తున్న బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ పై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దేశం మొత్తానికి, ముఖ్యంగా నేటి యువతకు ఆదర్శంగా ఉన్న మహానుభావుడు అబ్దుల్ కలామ్ ను అడ్డంపెట్టుకుని కమల్ హాసన్ తన సొంత ప్రయయోజనాల కోసం ఆయన పేరును ఉపయోగించుకుంటున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ మండిపడ్డారు.
కమల్ వ్యాఖ్యలు
తన రాజకీయ రంగప్రవేశం డాక్టర్ అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి ప్రారంభం అవుతుందని, ఈనెల 21వ తేదీ రామనాథపురంలోని ఆయన ఇంటిని సందర్శించి నివాళులు అర్పించి తమిళనాడు రాష్ట్ర పర్యటన చేస్తానని కమల్ హాసన్ చెప్పారు.
కలామ్ దేశం సొత్తు ?
శుక్రవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన తమిళసై సౌందరరాజన్ అబ్దుల్ కలామ్ దేశం మొత్తానికి ఆదర్శమని అన్నారు. ముఖ్యంగా భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలామ్, ఆయన దేశం సొత్తు అని తమిళసై సౌందరరాజన్ అన్నారు.
యువతకు ఆదర్శం
భారతదేశ భద్రత కోసం, సరికొత్త టెక్నాలజీ కోసం అబ్దుల్ కలామ్ తన జీవితాన్ని త్యాగం చేసి మిసైల్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని తమిళసై సౌందరరాజన్ చెప్పారు. అలాంటి అబ్దుల్ కలామ్ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని, ఎన్నటికీ ఆయన మనకు ఆదర్శంగానే ఉంటారని ఆమె అన్నారు.
స్వార్థం, పబ్లిసిటీ కోసం !
అబ్దుల్ కలామ్ రాజకీయాలకు అతీతంగా ఉన్నారని, ఆయన ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తన స్వయం శక్తితో రాష్ట్రపతి అయ్యారని తమిళసై సౌందరరాజన్ అన్నారు. అలాంటి మహానుభావుడిని అడ్డం పెట్టుకుని కమల్ హాసన్ తన స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని, మొత్తం పబ్లిసిటీ కోసం అని తమిళసై సౌందరరాజన్ ఆరోపించారు.
బీజేపీ రెడీ
తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ సిద్దంగా ఉందని తమిళసై సౌందరాజన్ అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండానే తాము పోటీ చేస్తామని, మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామని తమిళసై సౌందరాజన్ ధీమా వ్యక్తం చేశారు.