అస్సాంలో సీట్ల పంపకం కొల్లిక్కి: 92 స్థానాల్లో బీజేపీ పోటీ, షాకిస్తామంటున్న బీపీఎఫ్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అస్సాంలో సీట్ల పంపకాలను పూర్తి చేసింది అధికార భారతీయ జనతా పార్టీ. మార్చి 27 నుంచి రాష్ట్రంలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల పంపకాలను పూర్తి ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.
Recommended Video
అస్సాంలో 92 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ..
అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలుండగా.. బీజేపీ 92 స్థానాల్లో, అసోం గణ పరిషద్(ఏజీపీ) 26 స్థానాల్లో, యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్) మరో 8 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఇక బీజేపీలో విలీనమైన ఓ స్థానిక పార్టీ నుంచి ఒకరు లేదా ఇద్దరు బీజేపీ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే 84 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం. శుక్రవారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ పార్టీ నేతలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, మాజీ సీఎం, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఏజీపీ వ్యవస్థాపకులు ప్రఫుల్లా కుమార్ మహంతాకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. అయితే, మహంతా అనారోగ్యంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
బీజేపీకి వ్యతిరేకంగా బీపీఎఫ్ పనిచేస్తుందా?
2016లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో 84 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 60 సీట్లను దక్కించుకుంది. 2011లో బీజేపీ 55 స్థానాలు కైవసం చేసుకుంది. కాగా, ఏజీపీ 24 స్థానాల్లో పోటీ చేయగా 14 స్థానల్లో గెలుపొందింది. యూపీపీఎల్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) కాంగ్రెస్ నుంచి విడిపోయి 16 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇప్పుడు బీజేపీకి కూడా దూరమైంది ఈ పార్టీ. అస్సాంలో బీజేపీని లేకుండా చేస్తామని బీపీఎఫ్ చీఫ్ హగ్రామ మోహిలరీ అన్నారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు లేకుండా ఎలా గెలుస్తుందో చూస్తామంటున్నారు.
మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..
కాగా, ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం అస్సాం సీట్ల పంపకం ఓ కొలిక్కి రావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పశ్చిమబెంగాల్, అస్సాం అభ్యర్థులపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ అస్సాం ఇంఛార్జీ, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, డిప్యూటీ ఇంఛార్ఝీ, మినిస్టర్ ఫర్ స్టేట్ జితేంద్ర సింగ్, అస్సాం ముఖ్యమంత్రి శర్బనంద సోనోవాల్, మంత్రి హిమంత బిస్వశర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అస్సాంలో మళ్లీ బీజేపీనే..
కాగా, అస్సాంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 2016లో తొలిసారి అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. 2021 ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు.