ఆయన ఖాళీగా ఏం లేరు.. లోక్సభలో కూర్చుని రాజ్యసభలో మెజార్టీకి స్కెచ్ వేస్తున్నారు..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ చతురతే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. గాంధీ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎన్నికైన ఆయన తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. కేంద్ర హోం శాఖ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అయితే లోక్సభలో కూర్చొని అమిత్ షా కేవలం ఎంపీ, మంత్రి బాధ్యతలకే పరిమితమయ్యారని భావిస్తే తప్పులో కాలేసినట్లే. ఒకవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు.
పిల్లలకు బండిస్తే పేరెంట్స్కు జైలు.. తాగి నడిపితే రూ.పదివేలు ఫైన్..
Recommended Video
రాజ్యసభలో మెజార్టీ కోసం
ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే రాజ్యసభలో పరిస్థితి భిన్నంగా ఉంది. మెజార్టీ లేకపోవడంతో బిల్లులు పెండింగ్లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ సభలో సంఖ్యాబలం పెంచుకునేందుకు అమిత్ షా వ్యూహాలు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలకు కాషాయ కండువా కప్పి రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకున్నారు. దీంతో ఎగువసభలో బీజీపీకి 71గా ఉన్న సంఖ్యాబలం 75కి చేరింది. తాజాగా ఐఎన్ఎల్డీకి చెందిన ఏకైక రాజ్యసభ సభ్యుడు రాం కుమార్ కశ్యప్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తమ పార్టీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ సమర్పించారు. రాం కుమార్ కశ్యప్ చేరికతో బీజేపీ బలం 75 నుంచి 76కు పెరగనుంది.
బలం పెంచుకునే పనిలో బీజేపీ
రాజ్యసభలో మరో రెండేళ్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం భారీగా పెరిగే ఛాన్సుంది. ప్రస్తుతం బీజేపీ కూటమికి 99మంది ఎంపీలు ఉండగా.. ప్రతిపక్షానికి 65 మంది మద్దతుంది. 250 మంది సభ్యులున్న రాజ్యసభలో ఏ బిల్లైనా ఆమోదం పొందాలంటే 124 మంది బలం అవసరం. ఈ ఏడాది 10సీట్లు ఖాళీ కానుండగా.. 2020లో 72 స్థానాలకు ఎన్నిక జరగనుంది. వచ్చే ఏడాది యూపీలో 10 సీట్లకు ఎన్నిక జరగనుండగా.. బీజేపీ వాటిలో 9 తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.
అసెంబ్లీ గెలుపుపై అమిత్ షా గురి
రాజ్యసభలో మెజార్టీ పెంచుకునేందుకు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లే ముఖ్యం. వాటి ఆధారంగానే ఆయా పార్టీలు పెద్దల సభకు ఎంపీలను పంపే అవకాశముంది. ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నమోదుచేస్తే రాజ్యసభలో బలం పెరుగుతుంది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎన్డీఏ తన మార్కు పాలన చూపించాలన్నా.. కొత్త సంస్కరణలకు తెర తీయాలన్నా.. రాజ్యసభలో మెజార్టీ అత్యవసరం. ఈ నేపథ్యంలో వీలైనన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకునేందుకు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సర్వశక్తులు ఒడ్డనుంది.
2021 నాటికి మేజిక్ ఫిగర్
ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. రానున్న రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు సత్తా చాటితే 2021 ఇది సాధ్యమవుతుంది. బీహార్లో జేడీయూ, తమిళనాడులో అన్నాడీఎంకే, మహారాష్ట్రలో శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యా బలం ఆధారపడి ఉంది. ఒకవేళ అన్నీ కలిసొచ్చి పెద్దల సభలో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటితే కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలోనూ మెజార్టీ సాధించిన పార్టీగా 15ఏళ్ల తర్వాత బీజేపీ రికార్డు సృష్టించనుంది. అయితే అమిత్ షా రాజకీయ చతురతతో 2020 నాటికే ఆ రికార్డు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.