ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా..?
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికారిక బీజేపీ పరిస్థితి ఏంటి..? ఎన్ని సీట్లు గెల్చుకుంటుంది. మొత్తానికి దేశంలో బీజేపీ పట్ల ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనేదానిపై ప్రముఖ జాతీయ పత్రిక మరియు కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ 2020 పేరుతో సర్వే నిర్వహించారు. ఇంతకీ ఆ సర్వేలో తేలిని అంశాలు ఏంటి..? బీజేపీ సంబరపడేలా ఫలితాలు వచ్చాయా.. లేక ప్రతిపక్షాలకు సంతోషం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయా...?
మరో కశ్మీర్గా కేరళ, సీఏఏకు సపోర్ట్ చేసిన వారికి నో వాటర్, బీజేపీ ఎంపీ కామెంట్లు, కేసు నమోదు
ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే...
2019 లోక్సభ ఎన్నికలు ముగిసి 7 నెలల కాలం పూర్తయ్యింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పనితీరుపై సర్వేలు ప్రారంభమయ్యాయి. గత కొంత కాలంగా దేశం నిరసనలు ఆందోళనలతో అట్టుడికి పోతోంది. కేంద్రం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలతో సంతృప్తి చెందని ఒక వర్గం తమ నిరసనలను తెలుపుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానిపై మూడ్ ఆఫ్ ది నేషన్ 2020 పేరుతో సర్వే నిర్వహించారు.
పడిపోనున్న బీజేపీ గ్రాఫ్..కాస్త పెరగనున్న కాంగ్రెస్ గ్రాఫ్
2019 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ బలం 271 స్థానాలకు పడిపోతుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. మొత్తం 32 స్థానాలను కోల్పోనుంది. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఒక్క సీటుతో దూరం అవుతుందని సర్వే వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్కు 2019తో పోలిస్తే 8 సీట్లు అధికంగా వస్తాయని వెల్లడించింది.
ఎన్డీయే కూటమికి 50 స్థానాలు తక్కువ
ఇక ఆయా పార్టీల పొత్తుల ఆధారంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే అధికారిక ఎన్డీయే కూటమికి 50 సీట్లు తక్కువగా వస్తాయని సర్వే వెల్లడించింది. ఇప్పటికే శివసేన ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం, దేశంలో పౌరహక్కులపై జరుగుతున్న నిరసనలే ప్రధాన కారణంగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. అయితే సీట్ల స్థానం పడిపోయినప్పటికీ 303 స్థానాలతో స్థిరమైన మెజార్టీ ఎన్డీయేకు ఉంటుందని సర్వే తెలిపింది. ఇక యూపీఏ పరిస్థితి కాస్త మెరుగుపడింది. 15 పార్లమెంటరీ స్థానాలు దక్కించుకుంటుందని సర్వే వెల్లడించింది.
మహాకూటమితో బీజేపీకి విషమ పరీక్ష
మే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 50సీట్లు కోల్పోయి 4 శాతం ఓటు షేరును సైతం కోల్పోనున్నదని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెబుతోంది. ఇక యూపీఏ 15 సీట్లు నెగ్గడంతో పాటు 2శాతం ఓటు షేరును పెంచుకోనుందని సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ ప్రధాని మోడీకి బీజేపీకి కలిసిరాని అంశం ఏంటంటే యూపీఏ నేతృత్వంలో శివసేన, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ లెఫ్ట్ పార్టీలు మహాఘట్బంధన్గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని సర్వే జోస్యం చెప్పింది. ఇదే జరిగితే దేశ రాజకీయ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం కావడమే కాకుండా ఎన్డీయేకు కూడా విషమ పరీక్షగా మారుతుందని సర్వే చెప్పుకొచ్చింది.