జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు: ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో బీజేపీకి చుక్కెదురు..కారణం అదేనా..?
జార్ఖండ్ : జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. 65.17శాతం పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో ఎక్కువగా గిరిజన బెల్టు ఉంది. మొత్తం 81 స్థానాల్లా 40కి పైగా నియోజకవర్గాల్లో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గిరిజనులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు అంటే 40 నియోజకవర్గాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ముందంజలో ఉంది. ఇక ఈ నియోజకవర్గాల్లో యాదవ ఓట్లతో పాటు ముస్లిం ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.
మరోవైపు ఈ గిరిజన ప్రాంతాల్లో మావోల ప్రభావం ఎక్కువగా కూడా ఉంటుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7వరకు మావోయిస్టుల ప్రభావిత నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తం సీట్లలో 40శాతం సీట్లకు ఈ దశల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇందులో 20 స్థానాలు ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యాయి. జార్ఖండ్లో 26 శాతం జనాభా గిరిజనులదే కావడం విశేషం. మొత్తం మీద 28 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది.
ఇక ఎస్టీ నియోజకవర్గాల్లోనే బీజేపీ సవాల్ను ఎదుర్కొంటోంది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. గతేడాది ప్రభుత్వం చోటానాగ్పూర్ టెనన్సీ చట్టంను సవరించడం, సంతల్ పారగాన టెనన్సీ చట్టంను సవరించడాన్ని ఇక్కడి గిరిజనులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఇక్కడ బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. మరోవైపు ఒక ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు తిరిగి ఐదేళ్ల తర్వాత తమ స్థానాలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. 33 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాల్లోని సిట్టింగ్ అభ్యర్థులు ఎప్పుడూ తిరిగి గెలవలేదు. అదే ఈ సారి కాంగ్రెస్ కూటమికి ప్లస్ అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 17 స్థానాల్లో 8 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు కావడం విశేషం.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో విజయబాహుటా ఎగురవేసింది. 2009తో పోలిస్తే ఇక్కడ స్వల్ప మెజార్టీని మాత్రమే బీజేపీ రికార్డ్ చేసింది. 2014లో కాంగ్రెస్ ఆర్జేడీలు ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్క సీటును కూడా గెలవకపోవడం విశేషం. అయితే 2009తో పోలిస్తే 2014లో జేఎంఎం తన ఓటు శాతాన్ని రెట్టింపు చేసుకుంటూ కొన్ని సీట్లను ఇక్కడ గెలిచింది. మొత్తానికి 2019 మాత్రం ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో బీజేపీకి మొండి చేయి దక్కేలా కనిపిస్తోంది. అన్ని స్థానాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమిలు ముందంజలో ఉన్నాయి.