సీఎం పదవి ఎర: బీజేపీపై విశ్వాస్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ బీజేపీ పైన సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రినిచేస్తానంటూ ఓ బీజేపీ ఎంపీ తనకు ఎర వేసే చేశారన్న ఆయన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆగస్టు 19న ఓ బీజేపీ ఎంపీ ఘజియాబాద్లోని తన నివాసానికి వచ్చారని, కొంతమంది ఏఏపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎంగా అవకాశం కల్పిస్తానని చెప్పారని, ఆ ప్రతిపాదన తనకు సమ్మతమైతే తనను బీజేపీ సీనియర్ నాయకుల వద్దకు తీసుకెళుతానని చెప్పారని శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
తనను కలిసిన బీజేపీ ఎంపీ పేరును కుమార్ విశ్వాస్ వెల్లడించనప్పటికీ ఆప్కు చెందిన మరో నేత సంజయ్ సింగ్ ఈశాన్య ముంబై నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మనోజ్ తివారీ ఈ ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు.
అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, ఆయన తనకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడన్నారు. తామిద్దరం రకరకాల సంఘాల్లో కలిసి పని చేశామన్నారు. బీజేకీకి కొత్తగా ఎన్నిక అయిన ఆయన ఒకరోజు రాత్రి నన్ను కలిసేందుకు వచ్చారని, చాలాసేపు చర్చలు జరిపినట్లు కుమార్ తెలిపారు. సీఎం పదవి తీసుకోవచ్చునని, అమ్ అద్మీ పార్టీ సభ్యులు కూడా మద్దతు ఇస్తామని చెప్పారన్నారు. అయితే, విశ్వాస్ ఆరోపణలను అటు మనోజ్ తివారీ, ఇటు బీజేపీ తీవ్రంగా ఖండించాయి.