కాంగ్రెస్ 114, బీజేపీ 109, మధ్యపద్రేశ్ లో రసవత్తర రాజకీయాలు, ప్రభుత్వానికి హ్యాండ్ ఇస్తారా ?
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి మొదలైయ్యింది. ఇంత కాలం కర్ణాటకలో ఆపరేషన్ కమల అంటున్న బీజేపీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమలకు శ్రీకారం చుట్టింది. మొత్తం మీద కర్ణాటక కంటే ముందే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీకి అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు పుష్కలంగా ఉందని వెలుగు చూసింది.
నాకు ముందే తెలుసు అంటున్న సీఎం !
ఒక్క వారం ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందని తన దగ్గర సమాచారం ఉందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అంటున్నారు. ప్రైవేటు టీవీ చానల్ తో మాట్లాడిన సీఎం కమల్ నాథ్ బీజేపీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని స్వయంగా అంగీకరించారు.
స్పీకర్ ఎన్నికలు
స్పీకర్ ఎన్నిక సమయంలోనే తాను బీజేపీ గాలం వేసిన ఎమ్మెల్యేల గురించి గమనించానని, అయినా అటువంటి వారి గురించి చర్చించరాదని సీఎం కమల్ నాథ్ అంటున్నారు. ఎవరు బీజేపీ వైపు వెళ్లినా తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు మాయం
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీఎస్ పీ, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కమల్ నాథ్ సింగ్ ఆధ్యర్వంలో కాంగ్రెస్, బీఎస్ పీ, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఎస్ పీ కి చెందిన ఎమ్మెల్యేలు సంజీవ్ సింగ్ ఖుష్మా, రాంభాయ్ తో పాటు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.
చిచ్చురేపిన జోతిరాధిత్య సింధియా
సోమవారం అర్దరాత్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జోతిరాధిత్య సింధియా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఏకాంతంగా సమావేశం అయ్యారు. వీరిద్దరు భేటీ అయిన సమయంలో రెండు పార్టీల నాయకులను ఆ గదిలోకి అనుమతించకపోవడంతో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది.
బీజేపీ, కాంగ్రెైస్ మెజారిటి
మధ్యప్రదేశ్ లో 230 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 114, బీజేపీకి 109, ఇద్దరు బీస్పీ ఎమ్మెల్యేలు, మిగిలిన వారు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే బీఎస్ పీ, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు నేడు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారని వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీలో గుబులు మొదలైయ్యింది. మొత్తం మీద కర్ణాటకలో కంటే ముందే మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమలతో అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.