బీజేపీ కుట్ర!, తమిళనాడులో ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకే..: కుష్బూ
ప్రస్తుత అనిశ్చితి నుంచి గట్టెక్కి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు అన్నాడీఎంకె పార్టీ బీజేపీతో కూటమి ఏర్పరుచుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని కుష్బూ అన్నారు.
టీనగర్: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అంది వచ్చిన ప్రతీ మార్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. శశికళపై పన్నీర్ సెల్వంపై తిరుగుబాటు, తాజాగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య సంధి చర్చలు.. ఇవన్నీ బీజేపీ చలవే అనేవారు లేకపోలేదు.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన సినీ నటి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కుష్బూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకే బీజేపీ ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఈ సందర్భంగా కుష్బూ ఆయనకు వివరించారు.
ప్రస్తుత అనిశ్చితి నుంచి గట్టెక్కి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు అన్నాడీఎంకె పార్టీ బీజేపీతో కూటమి ఏర్పరుచుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని కుష్బూ అన్నారు. అయితే దొడ్డిదారిన తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తే.. బీజేపీకి కలలే మిగులుతాయన్నారు.
డీఎంకె ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ సైతం బీజేపీపై ఇవే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పగటి కలలు ఫలించబోవన్నారు. రాష్ట్ర రైతుల 19డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలంటూ డీఎంకె చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు.