పాగా వేయలేకపోయాం?: ఎగ్జిట్ పోల్స్పై బీజేపీ అసంతృప్తి
న్యూఢిల్లీ: మే 19... ఆరోజు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంతమాత్రం సంతృప్తి కరంగా ఉన్నట్టు కనిపించడం లేదు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గాలి వీచి బీజేపీ సత్తా చాటి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అంతేకాదు ఆ ఫలితాలు మోడీ పని అయిపోయిందంటూ విపక్షాలు విమర్శలు చేశాయి.
ఇప్పుడు మళ్లీ ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో అసోంలో బీజేపీ అధికారంలోకి రానుందని చెబుతున్నప్పటికీ, బీజేపీ ఏమంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల తర్వాత కేరళలో నిర్ణయాత్మకంగా ఉంటామని ప్రధాని మోడీ ప్రచారంలో ఊదరగొట్టారు.

అయితే ఆ పార్టీ ఆలోచన నెరవేరుతుందన్న ఆశలు లేకపోగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీకి కనీస గుర్తింపు కూడా రాకపోవచ్చని వస్తున్న అంచనాలు ఆ పార్టీకి అశనిపాతమేనని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు బీజేపీ పెద్దలకు మింగుడుపడటం లేదు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, "గుర్తుంచుకోండి... బీహార్లో ఎన్నికల అనంతరం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజైవైంది. వాస్తవ ఫలితాలకు ఏ ఒక్క సంస్థ కూడా కనీసం దగ్గరకు రాలేకపోయింది. 19వ తేదీ వరకూ వేచి చూడండి" అని ఆయన అన్నారు.
లాలూ వ్యాఖ్యల్లో బీజేపీ పట్ల సానుకూలత లేకపోవడం ఒకటి కాగా, తమిళనాడులో డీఎంకే కూటమి విజయం సాధించడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా భావించొచ్చు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉండటమే. ఇలా కాంగ్రెస్ కూటమిగా ఉన్న పార్టీలు గెలవడం, మోడీకి మరో రకంగా ఓటమి కిందే లెక్క.
ఇప్పటికే రాజ్యసభ సభ్యులను కోల్పోయిన కాంగ్రెస్, తదుపరి ఆ సంఖ్యను పెంచుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అంతేకాదు తమిళనాడు రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే స్థానాల్లో గెలుపొందేవారు పరోక్షంగా కాంగ్రెస్కు ఉపయోగపడే వారే. ఇది ఒక రకంగా ఎన్టీఏ ప్రభుత్వానికి చుక్కెదురు.
నిజానికి పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకుంటామని బీజేపీ ఎన్నడూ భావించలేదు. ఇక కేరళ, తమిళనాడుల్లో సైతం పాగా వేస్తే చాలని ఆ పార్టీ భావించింది. అయినప్పటికీ బీజేపీ భావించినట్లు జరగక్కపోవడం ఆ పార్టీకి నిజంగా ఎదురుదెబ్బే. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్పై బీజేపీ అసంతృప్తిగా ఉంది.












Click it and Unblock the Notifications