బీజేపీ మేనిఫెస్టో : వడ్డీలేని రుణాలు, రామమందిర నిర్మాణం, అభివృద్ధే ప్రధానాంశాలు
సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2014లో బీజేపీ ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సారి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళుతోంది బీజేపీ. ఇక దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్కు రెండు రోజుల సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను ఢిల్లీలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.
ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ బిజీ... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..?
48 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్కు రెండు రోజుల సమయం ఉండగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 48 పేజీలు ఉన్న మేనిఫెస్టోలో ప్రధానంగా వ్యవసాయం, విద్య, దేశభద్రత అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మూడు అంశాల పట్ల తాము ఎలా వ్యవహరించబోతున్నామనేది మేనిఫెస్టోలో పొందు పర్చింది. తన నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీతో పాటు మరో 12 ఉపకమిటీలతో సంప్రదింపులు జరిపాకే మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. " బీజేపీ రూపొందించిన మేనిఫెస్టో 130 కోట్ల ప్రజలకు సంబంధించింది. 300 రథాలపై ప్రయాణించి ప్రజల మనసులను వారి అవసరతలను తెలుసుకున్నాం. మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యాం. సోషల్ మీడియా టీమ్లను కూడా కలిశాం" అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేస్తాం
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న చట్టం ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. జమ్ము కశ్మీర్లో గత ఐదేళ్లుగా శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పిన రాజ్నాథ్ సింగ్.... జనసంఘ్ ఆవిర్భావం నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే చెబుతున్నామని రాజ్నాథ్ వెల్లడించారు. ఇప్పుడు అదే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు చెప్పారు. ఇక జమ్ము కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను కూడా రద్దు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. జమ్ము కశ్మీర్లో ఉంటున్న ఇతర రాష్ట్రాల మహిళలకు ఆర్టికల్ 35ఏ అడ్డంకిగా మారిందని బీజేపీ వెల్లడించింది.అంతేకాదు జమ్ముకశ్మీర్ రాష్ట్రాభివృద్ధికి ఈ ఆర్టికల్ అడ్ఢుగా నిలుస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలన్న తపనతోనే ఈ ఆర్టికల్ను రద్దు చేస్తామని అదే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు రాజ్నాథ్ చెప్పారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తీసుకొస్తాం
ఇకపై అన్ని రాష్ట్రాలకు ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు రాజ్నాథ్ సింగ్. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వనరులను, భద్రతా దళాలను విరివిగా వినియోగించి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ఒకే ఓటరు కార్డు విధానంను తీసుకొచ్చి తద్వారా అన్ని ఎన్నికలకు అదే కార్డు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు.
అయోధ్య రామమందిరం, శబరిమలై ఆలయాలపై...
వివాదాస్పద అయోధ్య రామమందిర నిర్మాణం గురించి తమ మేనిఫెస్టోలో ప్రస్తావించింది బీజేపీ. రాజ్యాంగం పరిధిలోనే రామమందిరం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన బీజేపీ .... ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తారో అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రామజన్మభూమి బాబ్రీ మసీదుకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యవర్తులను ఏర్పాటు చేసింది. ఇకతొలిసారిగా బీజేపీ మేనిఫెస్టోలో శబరిమల అంశం కనిపించింది. శబరిమలైలో పూజలు, భక్తి, సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామాని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చింది.
యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు
ఇక చిన్న తరహా వ్యాపారులకు నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రిటైల్ వ్యాపారం వృద్ధి చెంది తద్వారా రిటైల్ వ్యాపారులకు లబ్ధి చేకూరేలా జాతీయ స్థాయిలో విధానాలను రూపొందిస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చింది. అంతేకాదు జీఎస్టీ కింద నమోదైన చిన్న తరహా వ్యాపారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.10లక్షలతో బీమా కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
ఇక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వారికి రూ.50 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని కమలం పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇందులో భాగంగా 50శాతం రుణాలు యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇస్తామని చెప్పగా... మరో 25శాతం రుణాలను పురుషులకు ఇస్తామని చెప్పారు. కచ్చ ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ 2024 నాటికి ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామని వెల్లడించింది. రహదారుల అభివృద్ధి, 2022 నాటికి హైస్పీడు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని పేర్కొంది.
జవాన్ల కోసం ప్రత్యేక ప్రణాళిక
జవాన్లు పదవీవిరమణకు మూడేళ్ల ముందే వారి బాగుకోసం అన్ని విధాలుగా ఆదుకొనేలా ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇందుకోసం వారిలో నైపుణ్యత పెంచేందుకు శిక్షణ ఇస్తామని పేర్కొంది. అంతేకాదు పై చదువులు చదివేందుకు గాను ఆర్థిక సహాయం అందజేస్తామని, సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు సొంత వ్యాపారం పెట్టుకునేందుకు సహకారం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ఇక దశల వారీగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని తెలిపింది.