ప్రొటెం స్పీకర్పై గవర్నర్ అనూహ్య నిర్ణయం, నాడు మూడ్రోజుల్లో 2సార్లు..: కాంగ్రెస్Xబీజేపీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శనివారం సాయంత్రం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సమయంలో గవర్నర్ వాజుబాయి వాలా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం స్పీకర్ బాధ్యతలను బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యకు అప్పగించారు. కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ఏర్పాటైన యడ్యూరప్ప ప్రభుత్వం శనివారమే బలనిరూపణ చేయాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో తగిన ఏర్పాట్లు సమయంలో గవర్నర్ ఈ అనూహ్య నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే నియమితులవుతారని భావించారు. కానీ మూడు సార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను గవర్నర్ నియమించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బలపరీక్ష ఆయన ఆధ్వర్యంలోనే జరగనుంది. బోపయ్య 2004లో తొలిసారిగా మడికేరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు మిరాజ్పేట నుంచి గెలిచారు. 2008లో బీజేపీ హయాంలో ఆయన ఓసారి ప్రొటెం స్పీకర్గా పని చేశారు. అనంతరం ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. అయితే, బోపయ్య ఎంపికను విపక్షాలు తప్పుబడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ
బీజేపీ నిబంధనలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. నిబంధనల ప్రకారం సీనియర్ ప్రజాప్రతినిధి ప్రొటెం స్పీకర్గా నియమించాల్సి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన దేశ్ పాండే చాలా సీనియర్ నేత అని చెప్పారు. ఆయనకు కాకుండా మరొకరికి అవకాశమివ్వడం సరికాదన్నారు.
అంతా లెక్క ప్రకారమే
కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కొట్టి పారేశారు. 2008లో బోపయ్య ప్రొటెం స్పీకర్గా పని చేశారని గుర్తు చేశారు. ఇప్పటి కంటే ఆయన అప్పుడు చాలా జూనియర్ అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా చేయడాన్ని ఎలా తప్పుబడతారన్నారు. కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందన్నారు. నియమ, నిబంధనల మేరకే ఆయనను నియమించినట్లు తెలిపారు.
అప్పుడు కూడా బోపయ్యనే
బోపయ్యకు స్పీకర్ బాధ్యతలు అప్పగించడం ఇదేం కొత్త కాదు. పదేళ్ల క్రితం ప్రొటెం స్పీకర్గా పని చేశారు. 2010లో విశ్వాస తీర్మానం సమయంలోను కీలకంగా వ్యవహరించారు. యడ్యూరప్ప రెండుసార్లు విశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. అప్పుడు రెండుసార్లు కూడా బోపయ్య స్పీకర్గా వ్యవహరించారు. నాడు యెడ్డీ మూడు రోజుల్లో రెండు విశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.
రెండుసార్లు విశ్వాస తీర్మానం
యెడ్డీ మొదటిసారి 11 అక్టోబర్ 2010లో విశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. అప్పుడు బోపయ్య స్పీకర్ స్థానంలో ఉన్నారు. అది వివాదాస్పదమైంది. అనంతరం మూడు రోజులకు మరోసారి విశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. అప్పుడు బోపయ్య అందరినీ లెక్కించి మెజార్టీ ఉన్నట్లుగా తెలిపారు.