గుజరాత్ టు ఢిల్లీ, మూడు దశాబ్ధాల అనుబంధానికి ఫుల్స్టాప్, మకాం మార్చిన అద్వానీ, ఢిల్లీలో ఓటు..
లాల్కృష్ణా అద్వానీ.. బీజేపీ కురువృద్దుడు.. అగ్రనేత. పార్టీని విస్తరించి, అధికారంలోకి తీసుకురావడంలో కీ రోల్ పోషించారు. 1984లో రెండు సీట్లు గెలిచిన బీజేపీ.. 1989లో 85 సీట్లు తీసుకొచ్చిన యోధుడు. కానీ క్రమంగా పార్టీలో అద్వానీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. గుజరాత్ రాష్ట్రంతో అద్వానీకి సన్నిహిత సంబంధం ఉంది. గత 30 ఏళ్ల నుంచి అక్కడే ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. కానీ శనివారం ఢిల్లీ అసెంబ్లీలో అద్వానీ తన ఓటుహక్కు వినియోగించుకొని.. గుజరాత్కు గుడ్ బై చెప్పారా అనే సందేహాం కలుగుతోంది.
గుజరాత్ టు ఢిల్లీ
గుజరాత్లోని జమాల్పూర్-ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గంలో అద్వానీకి ఓటుహక్కు ఉండేది. కానీ ఇప్పుడు అది ఢిల్లీ ఓటర్ల జాబితాలో చేరింది. గుజరాత్లో ఓటు తీసేసి, న్యూఢిల్లీలో అద్వానీ నమోదు చేయించుకున్నారని అహ్మదాబాద్ ఎన్నికల అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. అద్వానీ విజ్ఞప్తి మేరకు గుజరాత్లో ఓటుహక్కు తొలగించామని చెప్పారు.
గాంధీనగర్కే మొగ్గు..
1989 లోక్సభ ఎన్నికలతో అద్వానీ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఢిల్లీతోపాటు గాంధీనగర్ నుంచి కూడా పోటీ చేశారు. గాంధీనగర్లో అద్వానీపై ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు రాజేశ్ ఖన్నా బరిలోకి దిగారు. అయితే కేవలం 1500 ఓట్లతో అద్వానీ విజయం సాధించారు. గాంధీనగర్పై నుంచి పోటీ చేయడానికే అద్వానీ ఆసక్తి కనబరిచారు. అలా గాంధీనగర్ నుంచి ఆరుసార్లు పోటీచేసి విజయం సాధించారు. కానీ 2019లో మాత్రం బీజేపీ అద్వానీకి టికెట్ ఇవ్వలేదు. అప్పటి పార్టీ చీఫ్ అమిత్ షాకు టికెట్ ఇచ్చి.. అద్వానీని అవమానించినంత పనిచేసింది.
కూతురుతో కలిసి ఓటు..
తన ఇలాఖాలో సీటు లేదనో.. పార్టీలో ప్రభ తగ్గిందో తెలియదు కానీ.. తన ఓటును కూడా మార్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా అద్వానీ ఓటువేశారు. తర్వాత ఓటును గుజరాత్ నుంచి ఢిల్లీకి మార్చుకున్నారు. శాశ్వత నివాస స్థలం కూడా ఢిల్లీగానే చూపించారు. శనివారం ఢిల్లీ ఔరంగజేబు్ రోడ్డులో గల అటల్ ఆదర్శ్ విద్యాలయలో తన కూతురు ప్రతిభా అద్వానీతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
దూరం.. దూరంగా...
గత కొంతకాలంగా తన కూతురు ప్రతిభా వద్దే అద్వానీ ఉంటున్నారు. అంతకుముందు ఎన్నికలు వచ్చినా ప్రతీసారి గుజరాత్ వెళ్లి.. మరీ వేసేవారు. కానీ ఈ సారి మాత్రం తన అడ్రస్ ఢిల్లీకి మార్చేశారు. గుజరాత్తో తన అనుబంధం తీరిపోయిందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.