105 కాదు 119 సీట్లు: మహా ట్విస్ట్, కొలువుదీరేది బీజేపీ సర్కారే..? కాషాయ నేతల ధీమా..
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉంటే.. బీజేపీ బాంబ్ పేల్చింది. తమను కాదని రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని తేల్చిచెప్పింది. బీజేపీ కామెంట్లతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ మహారాష్ట్రలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది.
సీఎంపీలో బిజీ బిజీ
శివసేన కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో నిమగ్నమైంది. డ్రాప్ట్కు అధినేతల ఆమోదం కోసం చూస్తోంది. ఇంతలో బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తమను కాదని మరో పక్షం ప్రభుత్వం ఏర్పాటు చేయదని పేర్కొన్నది. వాస్తవానికి బీజేపీ 105 సీట్లు ఉండగా.. 119 సీట్లతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ గూటికి మరో 14 మంది ఎమ్మెల్యేలు చేరతారని విస్పష్ట సంకేతాలు ఇచ్చింది.
105 కాదు 119 మంది
తమ సంఖ్యకు సంబంధించిన విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన ప్రయత్నిస్తోండగా.. బీజేపీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గడ్కరీ కూడా
ఇదిలాఉంటే మహారాష్ట్రలో ప్రతిష్టంభనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని స్పష్టంచేశారు. క్రికెట్లోనే కాదు రాజకీయాల్లో కూడా సమూల మార్పులు సాధ్యమని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఓడిపోయే మ్యాచ్ గెలుస్తామని.. గెలిచే మ్యాచ్ ఓడిపోయే సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.
20 రోజుల్లో ప్రభుత్వం..
ఇదిలాఉంటే మరో 20 రోజుల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరుతుందని ఎన్సీపీ ఆశాభావం వ్యక్తం చేసింది. కనీస ఉమ్మడి ప్రణాళికపై స్పష్టత వచ్చిందని ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. సోనియాగాంధీతో శరద్ పవార్ సమావేశమైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని చెప్పారు. శివసేన నుంచి సీఎం అభ్యర్థి ఉంటారని అంగీకరించారు. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎం, స్పీకర్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
గవర్నర్తో భేటీ
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కొషియారితో సమావేశమయ్యారు. రైతుల కోసం నిధులు విడుదల చేయాలని ఆయన గవర్నర్ను కోరారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.